Yanamala at Rajahmundry Central Jail: 
రాజమహేంద్రవరం: ఎలాంటి స్కామ్ జరగకున్నా స్కిల్ డెవలెప్మెంట్ ప్రాజెక్టులో తప్పుడు కేసులతో చంద్రబాబు నాయుడును అక్రమంగా జైల్లో పెట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జైలులో ఉన్నా కూడా రాష్ట్రం ఏమైపోతుందోనని చంద్రబాబు ఆలోచిస్తున్నారని చెప్పారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, యనమల రామకృష్ణుడు మంగళవారం మధ్యాహ్నం ములాఖత్ అయ్యారు. 


చంద్రబాబుతో ములాఖత్ అనంతరం రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ.. ఏ అవినీతి జరగకున్నా తప్పు చేసినట్లు సృష్టించి చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారు, రాష్ట్రాన్ని దోచిన వాళ్లే బాబు తప్పు చేశారని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. మచ్చలేని వ్యక్తిని జైల్లో పెడితే బాధపడకుండా ఉంటారా? జగన్ ప్రభుత్వం చంద్రబాబును వేధించి, హింసిస్తోందని ప్రజలు గుర్తించారని కీలక వ్యాఖ్యలు చేశారు. 


ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎలా ఉన్నారని చంద్రబాబు అడిగారని... కార్యకర్తలపై పెడుతున్న తప్పుడు కేసుల గురించి తెలుసుకుని బాధపడ్డారని యనమల తెలిపారు. ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజిత ఏపీని అభివృద్ధి చేసింది చంద్రబాబేనని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, చేపట్టిన కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రాన్ని వైసిపి పాలకులు ధ్వంసం చేస్తుంటే చంద్రబాబు సంతోషంగా ఎలా ఉంటారు? పథకాల పేరుతో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. 


జగన్ దోపిడీని సీబీఐ రుజువు చేసింది..
గతంలో జగన్ ముఠా దోపిడీని సీబీఐ కూడా వాటిని రుజువు చేసింది. అయినా వారు దర్జాగా జనం మధ్యలో తిరుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2049 నాటికి దేశం, రాష్ట్రం ఎలా ఉండాలన్న దానిపై చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశారని తెలిపారు. దానికి సన్నద్ధం అవుతున్న తరుణంలో కేసులు పెట్టి జైల్లో పెట్టారు. తనకు సంఘీభావం తెలిపిన జాతీయ నేతలకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలపమన్నారు.  ఏపీ భవిష్యత్తును నాశనం చేసే వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. జైలులో చంద్రబాబుకు కనీస సదుపాయాలు లేవు. తన సౌకర్యాల గురించి చంద్రబాబు బాధపడటం లేదని, కేవలం ప్రజల గురించే ఆలోచిస్తున్నారని యనమల తెలిపారు. 
పార్లమెంట్ లో పోరాడతాం..
చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై పార్లమెంట్ లో మా ఎంపీలు పోరాడతారని.. ఇది జాతీయ స్థాయి అంశం అన్నారు. కోర్టు విషయాలు బయట మాట్లాడటం సమంజసం కాదన్నారు. జాతీయస్థాయి నాయకుడిపైనే ఈ తీరుగా అక్రమ కేసు బనాయిస్తే, మిగతా వారిపై కేసులు పెట్టడన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. తాము కేసులకు భయపడే రకం కాదరి, జగన్ అరాచక పాలనపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని యనమల స్పష్టం చేశారు. 


శ్రీ సిద్ధి లక్ష్మీగణపతి ఆలయంలో భువనేశ్వరి పూజలు
అంతకుముందు రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో నారా భువనేశ్వరి, బాలకృష్ణ సతీమణి వసుంధర, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పార్టీనేతలు ఆదిరెడ్డి వాసు,  మంతెన సత్యనారాయణరాజు, పెందుర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.