Mahanadu 2023:గోదావరి తీరాన రాజమండ్రి వేదికగా మహానాడును తెలుగుదేశం అట్టహాసంగా నిర్వహించనుంది. నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. రాజమండ్రి శివారులోని వేమగిరిలో సభ జరుగుతున్నప్పటికీ తూర్పుగోదావరి మొత్తం పండగ వాతావరణం కనిపిస్తోంది. 


శత జయంతి వేడుక


ఎన్టీఆర్‌ శత జయంతి కావడంతో ఈసారి మహానాడును బారీగా ప్లాన్ చేసింది టీడీపీ. సమావేశాల కోసం 55 ఎకరాల్లో వేడుక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. పదిహేన వేల మంది ప్రతినిధులు కూర్చోవడానికి వీలుంటుంది. వేదికపై మూడు వందల మందికిపైగా కూర్చోవచ్చు. 


మొదటి రోజులు ఇలా


మొదటి రోజు ప్రతినిధుల సభ ఉంటుంది. వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూల మాల వేసి నివాళి అర్పిస్తారు. ప్రతినిధుల సభ రిజిస్టర్‌లో సంతకం చేస్తారు. అనంతరం మిగతా నాయకులు ఆయన్ని అనుసరిస్తారు. తొలి రోజు ప్రతినిధుల సభ జరుగుతుంది. రెండో రోజు బహిరంగ సభ నిర్వహిస్తారు. మొదటి రోజు జరిగే ప్రతినిధి సభకు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో పార్టీ లీడర్లు హాజరుకానున్నారు. యాభై వేల మంది కార్యకర్తలు కూడా వస్తారని పార్టీ అంచనా వేస్తోంది. 


ఏడాది కాలంలో మరణించిన పార్టీ నేతలకు సంతాప తీర్మానం, పార్టీ జమా ఖర్చుల నివేదిక, ప్రధాన కార్యదర్శి నివేదికను ప్రతినిధుల ముందు పెడతారు. తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు ఉపన్యాసం ఉంటుంది. 


రెండో రోజు ప్లాన్ ఇది


రెండో రోజు భారీ బహిరంగ సభ జరగనుంది దీనికి లక్షల్లో జనం వస్తారని టీడీపీ లీడర్లు చెబుతున్నారు. వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో ఆ దిశగానే ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ. గతేడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు భారీ జనసందోహం తరలిరావడం ఆ పార్టీలో నూతన ఉత్సాహం నింపింది. ఇప్పుడు అదే స్టైల్‌ను ఫాలో అవుతున్నారు. 


21 తీర్మానాలు


ఈసారి 21 తీర్మానాలను మహానాడులో చర్చకు పెట్టనున్నారు. ఇందులో 14 అంశాలు ఏపీకి చెందినవి అయితే... ఆరు తెలంగాణకు సంబంధించినవి. వైఎస్‌ఆర్‌సీ ప్రభుత్వ ఫెయిల్యూర్స్‌, అభివృద్ధి సంక్షోభం, ప్రభుత్వ అవినీతి, పథకాల పేరిట చేస్తున్న ప్రచార ఆర్భాటం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో ప్రవేశ పెట్టిిన పథకాలు, చేసిన అభివృద్ధి తీసుకున్న చర్యలు ప్రజలకు వివరిస్తారు. పొత్తులు, ఇతర రాజకీయ అంశాలపై కూడా తీర్మానం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. 


ప్రభుత్వంపై ఆరోపణలు


మహానాడుపై అధికార పార్టీ వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది టీడీపీ. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు రాకుండా అడ్డుపడుతోందని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సు, స్కూల్ బస్సులు ఇవ్వకుండా చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించిన జనం రాజమండ్రి వచ్చితీరుతారన్నారాయన. 


అతిథులకు గోదావరి రుచులు


మహానాడుకు తరలి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక భోజన ఏర్పాటు చేశారు. తొలి రోజు యాభై వేల మంది వస్తారని అంచనాతో వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్ర వరకు ఎప్పుడు వచ్చినా తినేలా వంటకాలు రెడీ అవుతున్నాయి. గోదావరి వంటకాలు రెండు రోజుల పాటు అతిథులను మైమరిపింపజేయనున్నాయి. 


మహానాడు కోసం 12 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి. ట్రాఫిక్ సమస్యలు లేకుండా సమాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చారు.