TDP MLA Balakrishna Speech at Mahanadu: ‘తెలుగువాడినని గర్వంగా చెప్పుకునేందుకు ధైర్యం ఇచ్చింది ఎన్టీఆర్. మహత్తర ఆశయాలు కలిగినవారే మహానుభావులు అవుతారు. ఎన్టీఆర్ ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారు’ అని నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరంలోని వేమగిరిలో జరుగుతున్న మహానాడు రెండో రోజు బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే నటనకు ప్రతిరూపం, గ్రంథాలయం, ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతం అన్నారు. ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని, ఆయన తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం అన్నారు బాలకృష్ణ. ప్రజల వద్దకు పాలన తెచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమన్నారు. నటనలో ఎన్నో ప్రయోగాలు చేసిన వ్యక్తి తన తండ్రి ఎన్టీఆర్ అన్నారు.  


ఎన్నో రాష్ట్రాలకు చంద్రబాబు విజన్ ఆదర్శమని కొనియాడారు. జగన్ అధికారంలోకి వచ్చాక సైకో పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ బాలకృష్ణ మండిపడ్డారు. బాదుడే బాదుడు పేరుతో అన్ని వస్తువుల ధరలు పెంచారని, వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. వైసీపీ పాలనలో కొత్త పరిశ్రమలు రావడం లేదన్నారు. రాష్ట్రానికి రాజధాని అమరావతి ఉండగా, సీఎం జగన్ 3 రాజధానుల పేరుతో కాలం వెళ్లదీస్తున్నారని, తెలుగువారి కలల రాజధాని అమరావతిని పక్కనపెట్టారని విమర్శించారు. 


టీడీపీ మహానాడులో నారా లోకేశ్..
పన్నులు, చార్జీలతో పేదవాళ్లను జగన్ బాదుడేబాదుడు అని లోకేశ్ మండిపడ్డారు. టిడ్కో ఇళ్లు కట్టింది చంద్రబాబు ప్రభుత్వమని అన్నారు. వైఎస్ఆర్ సీపీ రంగులు వేసి జగన్ తానే కట్టినట్లు చంకలు గుద్దుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘పాదయాత్రలో ప్రజల మనిషిగా ఎలా ఉండాలో తెలుసుకున్నా. నా పాదయాత్రను అడ్డుకునేందుకు చాలా ప్రయత్నించారు వైఎస్ఆర్ సీపీ నేతలు. అంబేద్కర్ రాజ్యాంగం ముందు రాజా రెడ్డి రాజ్యాంగం చిన్న బోయింది. 


‘‘ఐదు ప్యాలెస్ లు ఉన్న జగన్ పేదవాడ. మనది సైకిల్ పాలన, వైసీపీది సైకో పాలన. కరెంట్ చార్జీలు ఏడు సార్లు పెంచింది ఈ జగన్ ప్రభుత్వం. చెత్తపై పన్ను వేసిన చెత్త సీఎం జగన్ పెట్రోల్, డీజీల్ ధరలు వంద దాటింది. పండుగ కానుకలు కట్, పెళ్లి కానుకలు కట్ చేశారు. సెంట్ స్థలం వెనక పెద్ద కుట్రే ఉంది. ఇళ్లు కట్టకపోతే స్థలాలు వెనక్కి ఇవ్వాలని వైసీపీ నేతలు అంటున్నారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టకపోతే వైసీపీ నేతలు వాటిని కొట్టేస్తున్నారు. ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు. పాపాల పెద్దిరెడ్డి రూ.10 వేల కోట్ల అవినీతి చిత్తూరు జిల్లాలో చూశాను.’’ అని లోకేశ్ అన్నారు.