Nara Lokesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇసుకాసురుడైతే.. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భూబకాసురుడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. యువగళం పాదయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేశ్ పాల్గొని మాట్లాడారు. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని మండిపడ్డారు. గ్రంధి శ్రీనివాస్ పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదని.. ఆయన మాత్రం పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. భీమవరం ఎమ్మెల్యే వైసీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టించారని విమర్శించారు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదనని ఆరోపించారు.


భీమవరాన్ని మోడల్ టౌన్ గా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డు, రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్నారు. కిడ్నీ బాధితులకు డయాలసిస్ కేంద్రాన్నీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉండి సెంటర్ లో వంతెన నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. ఆకివీడు పంచాయతీలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. టీడీపీ హయాంలో భీమవరంలో రూ. 1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే రోడ్లు బాగు చేయిస్తామన్నారు. 


జగన్ పరాదాల్లో ఉంటాడని.. లోకేశ్ మాత్రం ప్రజల్లో ఉంటాడని నారా లోకేశ్ అన్నారు. జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం అయితే.. తనది మాత్రం అంబేడ్కర్ రాజ్యాంగం అని పేర్కొన్నారు. యువగళాన్ని తొక్కేస్తామన్నారని, ఇప్పుడు రాష్ట్రం అంతా యువగళమే అని అన్నారు. యువగళం దెబ్బకి వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ ముఖం మాడిపోయిందన్నారు. ఇప్పుడు రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ ఓ హాలిడే సీఎం అని.. అప్పుడప్పుడు రూ. కోట్లు ఖర్చు పెట్టి హాలిడేకి లండన్ వెళ్తారని లోకేశ్ ఆరోపించారు. 2 వేల కిలోమీటర్ల పాదయాత్రలో జనాల కష్టాలు చూశానని, కన్నీళ్లు తుడుస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించినట్లు గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నారా లోకేశ్ అన్నారు. 






భీమవరంలో లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. భీమవరం ప్రకాశం చౌక్ వద్ద ఈ వివాదం చెలరేగింది. 'పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం' పేరుతో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాయి. దీనికి వ్యతిరేకంగా 'అబ్బాయ్ కిల్డ్ బాబాయ్' పేరుతో టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీని కట్టాయి. దీంతో వివాదం చెలరేగింది. పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, అనంతరం తోపులాట జరిగాయి.