Chandrababu open letter to people from Rajahmundry Central Jail


స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్ర‌జ‌ల‌కు బహిరంగ లేఖ రాశారు. ‘నేను జైలులో లేను.. ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఉన్నాను. ప్రజ‌ల నుంచి న‌న్ను ఒక్క క్ష‌ణం కూడా ఎవ్వ‌రూ దూరం చేయ‌లేరు. 45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వ‌స్తున్న విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌ని చెరిపేయ‌లేరు. ఆల‌స్య‌మైనా న్యాయం గెలుస్తుంది.. నేను త్వ‌ర‌లో బ‌య‌ట‌కొస్తాను. ప్ర‌జ‌ల కోసం, రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేస్తాను’ అంటూ తన లేఖ ద్వారా అంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు.


చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖలో ఏముందంటే..
‘ఓట‌మి భయంతో నన్ను జైలు గోడ‌ల మ‌ధ్య బంధించి ప్ర‌జ‌ల‌కి దూరం చేశామ‌నుకుంటున్నారు. నేను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవ‌చ్చు. కానీ అభివృద్ధి రూపంలో ప్ర‌తీ చోటా క‌నిపిస్తూనే ఉంటాను. సంక్షేమం పేరు వినిపించిన ప్ర‌తీసారి నేను  గుర్తుకొస్తూనే ఉంటాను. ప్ర‌జ‌ల్నించి ఒక్క రోజు కాదు కదా!, ఒక్క క్ష‌ణం కూడా న‌న్ను దూరం చేయ‌లేరు. కుట్ర‌ల‌తో నాపై అవినీతి ముద్ర వేయాల‌ని ప్ర‌య‌త్నించారు కానీ.. నేను న‌మ్మిన విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌ని ఎన్న‌డూ చెరిపేయ‌లేరు. ఈ చీక‌ట్లు తాత్కాలిక‌మే. సత్యం అనే సూర్యుడి ముందు కారుమ‌బ్బులు వీడిపోతాయి. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు. జైలుగోడ‌లు నా ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బతీయలేవు.  జైలు ఊచ‌లు న‌న్ను ప్ర‌జ‌ల్నించి దూరం చేయ‌లేవు. నేను తప్పు చేయను, చేయనివ్వను.


 ఈ దసరాకి పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని  రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మహానాడులో ప్రకటించాను. అదే రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైలులో న‌న్ను ఖైదు చేశారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుద‌ల చేస్తాను. నా ప్ర‌జ‌ల కోసం, వారి పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను. ఎప్పుడూ బ‌య‌ట‌కు రాని నంద‌మూరి తార‌క‌రామారావు బిడ్డ, నా భార్య భువ‌నేశ్వ‌రిని  నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వారి త‌ర‌ఫున పోరాడాల‌ని నేను కోరాను. ఆమె అంగీక‌రించింది.  నా అక్ర‌మ అరెస్టుతో త‌ల్ల‌డిల్లి మృతి చెందిన వారి కుటుంబాల‌ని ప‌రామ‌ర్శించి, అరాచ‌క‌ పాల‌నను ఎండ‌గ‌ట్ట‌డానికి 'నిజం గెల‌వాలి' అంటూ మీ ముందుకు వ‌స్తోంది.


జ‌న‌మే నా బ‌లం, జనమే నా ధైర్యం. దేశ‌విదేశాల‌లో నా కోసం రోడ్డెక్కిన ప్ర‌జ‌లు వివిధ రూపాల్లో మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. నా క్షేమం కోసం కుల‌,మ‌త‌,ప్రాంతాల‌కు అతీతంగా మీరు చేసిన ప్రార్థ‌న‌లు ఫ‌లిస్తాయి. న్యాయం ఆల‌స్యం అవ్వొచ్చునేమో కానీ, అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయ‌మే.  మీ అభిమానం, ఆశీస్సుల‌తో త్వ‌ర‌లోనే  బయటకి వ‌స్తాను. అంత‌వ‌ర‌కూ నియంత  పాల‌న‌పై శాంతియుత పోరాటం కొన‌సాగించండి. చెడు గెలిచినా నిల‌వ‌దు, మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా కాల‌ప‌రీక్ష‌లో గెలిచి తీరుతుంది . త్వ‌ర‌లోనే చెడుపై మంచి విజ‌యం సాధిస్తుంది. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అంటూ’ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైలులోని స్నేహ బ్లాక్ నుంచి చంద్ర‌బాబు నాయుడు ప్రజలకు లేఖ రాశారు.