బడికి వెళ్లాల్సిన విద్యార్థులు రోడ్డెక్కారు. గత కొన్ని రోజులుగా బడికి వెళ్లకుండా గ్రామంలోని ఓ గుడి వద్దనే ప్రైవేటు టీచర్ ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. తరగతి పూర్తయిన వెంటనే షామియానాలోకి వచ్చి తమ తల్లిదండ్రులతో నిరసన తెలుపుతున్నారు. 


ఎన్నో ఏళ్లుగా తమ గ్రామంలో పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిన బడి మూసివేస్తున్నారని తెలిసి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ బడిని పక్క గ్రామంలో ఉన్న స్కూల్‌లో కలుపుతామని అధికారులు చెప్పడంతో ఆందోళనబాట పట్టారు 
తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గోడితిప్ప గ్రామంలోని విద్యార్థులు. 


ఎనిమిదో తరగతి వరకు చదువు చెప్పే ప్రభుత్వ యూపీ స్కూల్‌లో ప్రస్తుతం 90 మంది చదువుకుంటున్నారు. నేషనల్ పాలసీ అంటూ గోడితిప్ప యూపీ స్కూల్‌ను ఎత్తేస్తున్నారు. దీన్ని సుమారు మూడు కిలోమీటర్లు దూరంలో ఉండే గోడిలంక హైస్కూల్లో కలుపుతున్నట్లు విద్యాశాఖ చెబుతోంది. 


గోడితిప్పలో మత్స్యకార కుటుంబాలే ఎక్కువ. వారి పిల్లలే ఈ స్కూల్లో చదువుకుంటున్నారు. తమ గ్రామంలో ఏనాటి నుంచో ఉన్న స్కూల్‌ను ఇంకో గ్రామానికి తరలించేస్తే పిల్లలు చదువు ఏం కావాలని ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బిడ్డలు దూరమవుతారని వాపోతున్నారు. 


చదువులు చక్కగా సాగుతున్న టైంలో అకస్మాత్తుగా స్కూల్ ఎత్తేస్తే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు, గ్రామస్థులు. ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమంటున్నారు వారంతా. అధికారులకు విజ్ఞప్తులు చేస్తూ ఎన్నో వినతి పత్రాలు ఇచ్చారు. అయినా ఫలితం లేదు. దీంతో విద్యార్థులే పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. 


విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టి రోజులు గడుస్తున్నా ఏ ఒక్క అధికారి స్పందించలేదు. ప్రధాన రోడ్డు పక్కనే టెంట్ వేసుకుని నిరసన తెలుపుతున్నారు. స్థానిక అధికారులు కొందరు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళల్ు వెనక్కి తగ్గడం లేదు. స్కూల్ వేరే ప్రాంతానికి తరలించబోమని హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించబోమని తేల్చి చెప్తున్నారు. 


గోడితిప్ప యూపీ స్కూల్‌ను గోడిలంక స్కూల్‌లో విలీనం చేయడాన్ని  గ్రామస్తులు, విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. పిల్లలు రోడ్డుపై వెళ్లే ప్రమాదాల బారిన పడితే ఎవరిది బాధ్యతని నిలదీస్తున్నారు. అమలాపురుం నుంచి ఓడలరేవు వెళ్లే ఈ మార్గంలో భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయని చెబుతున్నారు. ఈ మత్స్యకార గ్రామంలో డ్రాప్ అవుట్లు తగ్గాయంటున్న ప్రజలు స్కూల్‌ విలీనంతో సమస్య మళ్లీ మొదటికి వస్తుందంటున్నారు. మళ్లీ డ్రాపవుట్లు పెరిగిపోతాయని చెబుతున్నారు. 


బడిలో ఉండాల్సిన పిల్లలు నిరసన తెలుపుతుంటే గోడితిప్ప యూపీ స్కూల్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు స్కూల్‌లోనే ఖాళీగానే ఉంటున్నారు. పాఠశాల సమయానికి వచ్చి టైం అయ్యాక తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించాలని అభిప్రాయపడుతున్నారు. 


నిరసనలు కారణంగా అమ్మఒడి లాంటి పథకాలు పోతాయని, విద్యాశాఖ అధికారులు ఏదోలా ఒప్పించే ప్రయత్నం చేసినా గోడి తిప్ప గ్రామస్తులు మాత్రం ససేమిరా అంటున్నారు. స్థానికంగా ఉన్న అమ్మవారి ఆ లయంలో ఓ ప్రైవేటు టీచరును ఏర్పాటు చేసుకుని పాఠాలు చెప్పించుకుంటున్నారు. స్కూల్ను కాపాడుకునేందుకు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కాపాడుకుంటామని తేల్చి చెబుతున్నారు గోడితిప్ప గ్రామస్తులు, విద్యార్థులు.