ఆయనో నిత్యవిద్యార్ధి ! ఇప్పటివరకు 33 డిగ్రీపట్టాలు సాధించిన ఘనత..


రాజమహేంద్రవరంకు చెందిన మానసిక వైద్యుడు రామారెడ్డి ప్రత్యేకత


త్వరలో మరో డిగ్రీ అందుకోనున్న సైక్రియాట్రిస్ట్, డాక్టర్ కర్రి రామారెడ్డి


మనం ఎంచుకున్న చదువులో దానికి సంబంధించి ఎన్నో డిగ్రీలు సాధించి ఆపై ఇక చాలు అనుకుంటాం. కానీ ఓ మానసిక వైద్యుడు మన ఊహకు అందనన్ని డిగ్రీలు చదివి అరుదైన రికార్డు సాధించారు. ఒక డిగ్రీకి మరో డిగ్రీకి సంబందంలేని విభాగాల్లోని కోర్సులన్నిటినీ ఓ పట్టు పట్టేశారు. దానికి ప్రతిఫలంగా ఇప్పటివరకు 33 డిగ్రీలు ఈ డాక్టర్ గారి ఖాతాలోకి చేరగా మరో డిగ్రీ కోసం ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు ఈ నిత్య విద్యార్ధి. ఆయనే రాజమహేంద్రవరంకు చెందిన ప్రఖ్యాత సైక్రియాట్రిస్ట్, మానస హస్పటల్ అధినేత కర్రి రామారెడ్డి. 
నేర్చుకోవాలన్న తపన ఉంటే రిజల్ట్ ఇలా ఉంటుంది..
రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో 42 ఏళ్ల క్రితం ప్రారంభమైన మానస ఆసుపత్రి కోస్తా జిల్లాలో తొలి ప్రైవేటు మానసిక ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. డాక్టర్ కర్రి రామారెడ్డి ఇప్పటివరకు లక్షా నలభై అయిదు వేలకు పైగా  రోగులను పరీక్షించి వైద్య సేవలందించడం విశేషం. ఇప్పుడు అదే ఆసుపత్రిలో మానసిక వైద్యునిగా రామారెడ్డి విశేషమైన సేవలందిస్తుండగా ఆయన కుమార్తె మానస కూడా మానసిక వైద్యురాలిగా ఇదే ఆసుపత్రిలో వైద్య సేవలందిస్తున్నారు.


చిన్ననాటి నుంచి చదువుపై ఎంతో ఆసక్తి..
డాక్టర్ కర్రి రామారెడ్డికి చిన్న నాటి నుంచి చదువుపైనా, కొత్త అంశాలపైన ఎనలేని ఆసక్తి, మక్కువ పెంచుకునేవారట.. అందుకే విద్యార్ధి దశలోనే అనేక కోర్సులు పూర్తిచేసి ఆపై సమాజంలో వైద్యునికి లభించే గౌరవం చూసి తాను కూడా తన అన్నయ్యలా వైద్యునిగా మారానని చెబుతారు. ఎంబీబీఎస్ పట్టా పొందిన తరువాత కష్టతరమైన న్యూరాలజీ స్పెషల్ కోర్స్ చదువుదామనుకున్న రామారెడ్డి కంటికి కనిపించని మానసిక శాస్త్రంపై మక్కువ పెంచుకుని దాని సాధన కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి సైక్రియాటిస్ట్ గా తిరిగొచ్చారు.


33 పట్టాలు పొంది అరుదైన ఘనత..
డాక్టర్ కర్రి రామారెడ్డి ఇప్పటివరకు డిగ్రీలు, పీజీ, డిప్లొమా తదితర కోర్సుల్లో 33 పట్టాలు పొందారు. తన వైద్య వృత్తికి ఏమాత్రం సంబంధం లేని కోర్సులు సైతం చాలా సునాయాసంగా పూర్తిచేసిన రామారెడ్డి ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎల్ఎల్‌బీ, ఎంబీఏ, ఆంగ్లంపై పట్టుకోసం ఎంఏ లిటరేచర్, అగ్రికల్చర్ ఇలా అనేక కోర్సుల్లో 33 డిగ్రీలు పొందారు. ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో బీఈడీ గోల్డ్ మెడల్ సాధించారు. నిరంతర విద్యార్ధిగా ఉన్న తనకు అందుకే వయస్సుతో సంబందం లేకుండా తాను చేసిన ప్రతీ కోర్సుల్లోనూ ఎంతో మంది స్నేహితులు తనకు ఉన్నారని చెబుతారు.


ప్రతిష్టాత్మక బీసీ రాయ్ నేషనల్ అవార్డు..
సైక్రియాటిస్ట్ గా ఎన్నో సేవలందించిన డాక్టర్ కర్రి రామారెడ్డికు ఎన్నో అవార్డులు వరించాయి.. దేశ ప్రతిష్టాత్మక బీసీ రాయ్ నేషనల్ అవార్డును రామారెడ్డి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. 33 డ్రిగీలు చదివినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును కైవసంచేసుకోగా రాష్ట్ర గవర్నర్ చేతులమీదగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్మారక పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుకున్నారు. డాక్టర్ కర్రి రామారెడ్డి కలం నుంచి వచ్చిన సైకాలజీ పుస్తకాలు మనిషి- మనసు, మనలో ఒకరు పుస్తకాలు బాగా పాపులర్ అయ్యాయి. పలు పత్రికలకు ఎన్నో వ్యాసాలు రాశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో 1954 లో జన్మించిన డాక్టర్ కర్రి రామారెడ్డి  విభిన్న వృత్తులకు సంబంధించి న కోర్సులను అవలీల గా పూర్తి చేశారు. ప్రస్తుతం కుమార్తె మానసతో కలిసి రోజుకు మూడంకెల సంఖ్యలో రోగులకు వైద్య సేవలందిస్తున్నారు.