చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర రోడ్డుభవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 420 చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పుట్టుకే ఒక 420 అన్నారు. ఆయన 2014లో ఇచ్చిన హామీలు మర్చిపోయి కొత్తగా ఇస్తున్నట్లు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ బృతి అంటూ మళ్లీ మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. అప్పుడు హామీ ఇచ్చావు.. ఆ హామీలు నిలబెట్టుకోలేనందుకే 2019లో నిన్ను బంగాళాఖాతంలో కలిపేశారని, అయినా సిగ్గులేకుండా మళ్లీ మళ్లీ చెబుతుతూ ప్రజలను మోసం చేసేందుకు 420లా మోసం చేస్తున్నాడని అన్నారు.


ముఖ్యమంత్రి విశాఖకు మారబోతున్నారు..


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించినట్లుగానే కచ్చితంగా వైజాగ్‌కు జగన్‌ షిప్ట్‌ అవుతారని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఈ రాష్ట్ర రాజధాని వైజాగ్‌ను ఇండియాలోనే టాప్‌ ఫైవ్‌ సిటీస్‌లో ఒక దానిలా చేయబోతున్నారని అన్నారు. ఎర్రన్నాయుడు కుమారుడు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మొదలు పెట్టాడని, జగన్‌ వైజాగ్‌ వస్తే కబ్జాలంటున్నాడు.. అసలు మీ 420 చంద్రబాబు కబ్జాలు భరించలేకనే 2019లో మీ చంద్రబాబును ఓడించి మూలన కూర్చోబెట్టారని అన్నారు. జగన్‌ వస్తే ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగి తండ్రీకొడుకులైన చంద్రబాబు, లోకేష్‌లు అడ్రస్‌ లేకుండా పోతారని వణుకు మొదలయ్యిందని అన్నారు. ఆ భయం నుంచి ఇటువంటి ప్రేలాపనలు వస్తున్నాయని, రామ్మోహన్‌ నాయుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని అన్నారు.


వ్యక్తిగత విషయాలు తెస్తే ఊరుకోం..


మూలనున్న ముసలి తాతకు బర్త్‌డే విషెస్‌ ఎందుకులే అని నీ కుటుంబ సభ్యులు చెప్పారా అని ప్రశ్నించారు. విజయమ్మకు బర్తెడ్‌ విషెస్‌ జగన్‌ చెప్పలేదని చెబుతున్నారని, మేము మాట్లాడితే మీరు పరుగులు పెడతారన్నారు. కుటుంబాలను నాశనం చేసిన చరిత్ర నీదని, నందమూరి కుటుంబాన్ని నాశనం చేశావన్నారు. నీ తల్లి చనిపోతే కర్నూల్‌ గెస్ట్‌ హౌస్‌లో మీటింగ్‌ పెట్టి మైలేజ్‌ కోసం పాకులాడావు. తల్లి అంత్యక్రియలకు వెళితే  మైలేజ్‌ వస్తుందా లేక వెళ్లకుంటే వస్తుందని ఆలోచించిన నీలాంటి నికృష్టుడు ప్రపంచంలో ఉండరన్నారు. 2024లో నిన్ను మూలన కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలను దొంగమాటలతోను, మభ్యపెట్టడానికి ప్రయత్నించ వద్దని అన్నారు. హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఎయిర్‌ పోర్ట్‌ దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితోనే అయ్యాయని తెలిపారు.