Konaseema District News
- పంచాయతీల్లో దొంగలు పడ్డారని ఫిర్యాదు..!
- కోనసీమ జిల్లాలో సర్పంచుల వినూత్న నిరసన..


డాక్టర్‌ బీర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ వద్ద సోమవరం సర్పంచులు వినూత్నంగా నిరసన తెలిపారు. మా పంచాయతీల్లో దొంగలు పడ్డారు. పంచాయతీలకు చెందిన రూ.860 కోట్లు దొంగిలించారు. సైబర్‌ నేరం కింద కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకు ఫిర్యాదు చేశారు. 14, 15 ఆర్థిక సంఘ నిధులు సర్పంచులకు తెలియకుండా తమ ఖాతాల్లో జమ కాకుండా దారి మళ్లిస్తున్నారంటూ పలువురు సర్పంచులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ర్యాలీగా స్పందన కార్యక్రమానికి వచ్చిన సర్పంచులు ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలతో చర్చనీయాంశం అయ్యింది.  


ఆర్థిక సంఘ నిధులకోసం సర్పంచుల పోరాటం..
పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14, 15 ఆర్థిక సంఘ నిధులను ఇంతవరకు పంచాయతీలకు జమ చేయడం లేదని, ఈ నిధులను దారి మళ్లించడం ద్వారా పంచాయతీల్లో రూపాయి కూడా లేని దుస్థితి తలెత్తిందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. ఈ కారణం చేత పంచాయతీల్లో కనీస నామమాత్రపు పనులు చేసేందుకు కూడా సొమ్ములు లేకుండా పంచాయతీ ఖజానా ఖాళీగా దర్శనమిస్తున్నాయని, ఏళ్ల తరబడి ఖాతాలు ఖాళీగానే ఉంటున్నాయని వాపోతున్నారు. పంచాయతీల్లో ఏ చిన్న పని చేయించలేక ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈప్రభుత్వంలో ఆర్థిక సంఘ నిధులు పూర్తిగా దారి మళ్లాయని సర్పంచులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. 


దొంగలెత్తుకెళ్లారని ఆరోపణలు.. ఫిర్యాదులు..
గత కొంత కాలంగా పంచాయతీ ఖాతాల్లో ఆర్థిక సంఘ నిధులు జమ కాకపోవడంతో పంచాయతీల్లో ఏపనులు చేయలేక పోతున్నామంటున్న సర్పంచులు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపిన సర్పంచులు కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్లించకుండా నేరుగా పంచాయతీలకు చేరేలా మూడేళ్ల క్రితమే బ్యాంకు ఖాతాలు కొత్తగా తెరవాలని సూచించారని, అప్పట్లో జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు తెరిచి ఇప్పటికీ అలానేఉన్నాయని, అయితే ఇంతవరకు రూపాయి కూడా జమకాలేదంటున్నారు. అసలు పంచాయతీ తీర్మానాలు, గ్రామ సభ ఆమోదం లేకుండా పంచాయతీ నిధులు ఎలా దారి మళ్లుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇందుకే తమ పంచాయతీలకు చెందాల్సిన డబ్బును ఇలా దొడ్డిదారిన దొంగల్లా దారి మళ్లించుకుపోతున్నారని, దీనిపై అందుకే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.