Tidco Transformers Disappear | డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ట్రాన్స్కోలో అవినీతి రాజ్యమేలుతోంది. లైన్మెన్లు, సిబ్బంది ప్రతీ పనిలోనూ మాముళ్లను దండుకోవడంలో నిమగ్నమవుతున్నారన్న ఆరోపణలపై అధికారులు చేపట్టిన విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.. టిడ్కో భవనాల వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 ట్రాన్స్ఫార్మర్లనే లేపేసి ఆపై అక్కడ ఎందుకు పనికి రాని డొక్కు ట్రాన్స్ఫార్మర్లు పెట్టారని ఆరోపణలున్నాయి. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు ఒక్కొక్కటి వెలికి తీస్తున్నారు. అయితే తవ్వే కొద్దీ ట్రాన్స్కో సిబ్బంది అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.. దీంతో ఇప్పటికే ఇద్దరు లైన్మెన్లపై చర్యలు చేపట్టిన అధికారులు ఇంకా ఆరోపణలు ఎదుర్కోంటున్న పలువురిపై విచారణ చేపట్టారు. టిడ్కో భవనాల వద్ద 17 ట్రాన్స్ఫార్మర్లను లేపేశారు... అమలాపురం పురపాలక పరిధిలోని సుమారు 1300 కుటుంబాలకు బోడసకుర్రు గ్రామంలో టిడ్కో భవనాలను నిర్మించి ఇచ్చింది ప్రభుత్వం ఇక్కడ లో విద్యుత్తు సరఫరా నిమిత్తం సుమారు 24 ట్రాన్స్ఫార్మర్లను అప్పట్లో ఏర్పాటు చేశారు. ఇవి పూర్తి నాణ్యతతో కూడిన టాటా సంస్థకు చెందిన ఫైవ్ స్టార్ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్లు.. అయితే వీటిని తొలగించి వాటి స్థానంలో పాతకాలపు ఎందుకు పనికి రాని స్టెప్డౌన్ ట్రాన్స్ఫార్మర్లను గుట్టుచప్పుడు కాకుండా బిగించి వాటిని అమ్మేసుకున్నారన్న ఆరోపణల మధ్య దర్యాప్తు చేపట్టారు అధికారులు.. అయితే ఇక్కడ తొలగించిన వాటిని ఆక్వాచెరువులకోసం అమ్మేసుకున్నట్లు ప్రాధమిక విచారణలో తేలింది.. అయితే దీనిపై మరింత సమగ్ర విచారణ చేపట్టి బాద్యులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.. అనధికార లేఅవుట్కు ట్రాన్స్ఫార్మర్ వేసి అక్రమాలు.. అనధికార లే అవుట్లు నుంచి అక్రమ ఆక్వా చెరువుల వరకు అక్రమాలకు తెరతీశారు సిబ్బంది.. ప్రభుత్వ నిభందనలు ఇది అక్రమమని తెలిసినా కూడా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేసి భారీగా డబ్బులు తీసుకున్న ఉదంతాలు బయటకు వచ్చాయి.. ముమ్మిడివరంలోని అనాతవరం వద్ద ఓ అనధికార లేఅవుట్లో రమేష్ అనే లైన్మేన్ మూడు విద్యుత్తు స్తంభాలను నిలబెట్టడమేకాదు వాటికి కండకర్లను ఏర్పాటు చేసి ఆపై ట్రాన్స్ఫార్మర్ బిగించాడు. దీనికోసం సదరు లే అవుట్ దారునుంచి భారీ స్థాయిలో డబ్బులు తీసుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. అయితే దీనిపై ఫిర్యాదు అందడంతో విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు సదరు లైన్మేన్ రమేష్ను సస్పెండ్ చేశారు.
అనధికార లే అవుట్లుకు, అక్రమ ఆక్వాచెరువులకు అడ్డగోలు కనెక్షన్లుతో దండుకోవడమే కాక ప్రతీ పనికి లంచాలు డిమాండ్ చేస్తున్న కామనగరువుకు చెందిన మరో లైన్మేన్ పినిపే శ్రీనుపై రూ.20 వేలు డిమాండ్ చేశాడని అధికారులకు పిర్యాదు అందింది.. సదరు లైన్మేన్పై అనేక అవినీతి ఆరోపణలు రాగా ఇతన్ని గతంలో సస్పెండ్ చేశారు. తీరప్రాంతాల్లో ఆక్వాచెరువుల వద్ద అడ్డగోలుగా అక్రమ విద్యుత్తు కనెక్షన్లు వచ్చేలా చేసి భారీ స్థాయిలోఅక్రమార్జన చేశాడన్న ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి.
కామనగరువు పంచాయితీ పరిధిలో లైన్మేన్గా పనిచేస్తున్న శ్రీను భారీ స్థాయిలో అక్రమార్జన చేశాడన్న ఆరోపణలపై విచారణ జరుగుతోంది.. ఇదేవిధంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విద్యుత్తుశాఖలో లంచం లేదనిదే ఏపని జరడం లేదని పలువురు ఫిర్యాదులు చేయడంలపై జిల్లాలోని పలువురు ట్రాన్స్కో ఏఈలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.