Konaseema Crime:దోపిడీ ముఠా కావడంతో వారిలో ఒకరి వద్ద రివాల్వర్‌ ఉంది. అతడి ముఠా వద్ద వాడిగల కత్తులు.. ఈ ఆయుధాలతో బెదిరిస్తారు. లొంగకుంటే కిడ్నాప్‌ చేస్తారు. ఆ తరువాత దోపిడీకి పాల్పడతారు. ఇదీ ఆరుగురు సభ్యుల అంతర్‌ జిల్లాల దొంగల ముఠా దోపిడీ ప్లాన్.  ఈ దొంగల ముఠా ఆట ఆటకట్టించారు అంబేడ్కర్‌ జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌ మీడియా సమావేశంలో ఈ ముఠా దోపిడీ కార్యకలాపాలను వెల్లడించారు
విజయనగరానికి చెందిన ఇద్దరు ముఠాగా ఏర్పడి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో నలుగురిని తమ ముఠాలో చేర్చుకుని మొత్తం ఆరుగురు కలిసి పలు దోపిడీలు, కిడ్నాప్‌లు, చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు ఎస్పీ శ్రీధర్‌ తెలిపారు. ప్రధాన నిందితులైన ఇద్దరిలో ఒకరైన షేక్‌ రఫీ గతంలో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసినట్లు చెప్పారు. ఇతను సరిగ్గా విధులు నిర్వహించకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించడంతో పలు నేరాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. ఉద్యోగంలో ఉండగా తీసుకున్న లైసెన్స్‌ రివాల్వర్‌ను వినియోగిస్తూ దోపిడీలకు పాల్పడేందుకు పలువురిని తుపాకీతో బెదిరించి ఆపై దోపిడీలకు పాల్పడుతున్నారని చెప్పారు. 


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దోపిడీలు..
దోపిడీల ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చన్న దీమాతో ఈ ఆరుగురు ముఠా సభ్యుల దోపిడీ బృందం పలు నేరాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలోనే ఏడాది నుంచి పలు నేరాలకు పాల్పడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సర్పవరం, జగ్గంపేట, ముమ్మిడివరం ప్రాంతాల్లో రివాల్వర్‌తో బెదిరించి దోపిడీలకు పాల్పడ్డారు. వీరిపై ఈ ప్రాంతాల పోలీస్‌ స్టేషన్లు పరిధిలో మూడు దోపిడీ, కిడ్నాప్‌ కేసులు నమోదయ్యి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో అయిదు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు.. వీటిపై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసుల కళ్లు గప్పి గత కొంతకాలంగా తిరుతుండగా చివరకు పాపం పండి అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో ముమ్మిడివరంలో ప్లాన్ ప్రకారం వీరిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఒక పిస్టల్‌, రివాల్వర్‌, బంగారం, నగదు స్వాధీనం..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు దోపిడీలకు పాల్పడతున్న ఆరుగురు సభ్యుల ముఠా వద్దనుంచి ఒక పిస్టల్‌, ఒక రివాల్వర్‌, రూ.14లక్షలు విలువచేసే 255 గ్రాముల బంగారు గోలుసులు, రూ.లక్షా ఇరవై వేల నగదు, 50 బుల్లెట్లు, నాలుగు కత్తులు, ప్లాస్టర్‌ టేప్‌, స్విఫ్ట్ డిజైర్‌ కారు, మూడు బైకులు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శ్రీధర్‌ వెల్లడించారు.


పోలీసులను అభినందించిన ఎస్పీ..
చాలా తక్కువ సమయంలో నిందితులపై నిఘా పెట్టి అరెస్ట్ చేసిన ముమ్మిడివరం పోలీసులతోపాటు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు, అమలాపురం డీఎస్పీ, ఐడీ పార్టీ కానిస్టేబుల్స్ ను జిల్లా ఎస్పీ శ్రీధర్‌ ప్రత్యేకంగా అభినందించారు.