CM Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కూనవరం, వీఆర్ పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వారం రోజుల కిందట గోదావరి నది పొంగి వరద వచ్చిన పరిస్థితుల్లో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల పరివాహంతో నీళ్లు వచ్చాయని సీఎం జగన్ అన్నారు. తమ ప్రాంతాలకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలి నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి ప్రతీ వివరాలు కలెక్టర్ వద్ద ఉన్నాయని తెలిపారు. మొట్టమొదటి సారిగా వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గతానికంటే భిన్నంగా చూశారన్నారు. తమందరి ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు ఏ నష్టం వచ్చినా కూడా అది ఏ ఫొటోల కోసమో లేకపోతే అప్పటికప్పుడు వచ్చి అధికార యంత్రాంగం అంతా నా చుట్టూ తిరుగుతున్నట్లు చేయడమో చేయలేదని చెప్పారు. అధికారులకు కావాల్సిన వనరులు ఇచ్చి వారం రోజులుల పాటు సహాయ కార్యక్రమాలకు ఏ మాత్రం అలసత్వం లేకుండా చేయాలని చెప్పామని వివరించారు. కలెక్టర్లకు సదుపాయాలు ఇచ్చి, గ్రామ సచివాలయాల దగ్గర నుంచి వలంటీర్ల నుంచి యాక్టివేట్‌ చేశామన్నారు. వరద వచ్చినా ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా సహాయం అందించే కార్యక్రమాన్ని చూస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 


ఈసారి వరద వచ్చినప్పటికీ అప్పటికప్పుడు తాను వచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోవడం కాకుండా కలెక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి, సరైన సమయం ఇచ్చి, అధికారులకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. వారం రోజుల్లో వాళ్లంతా ప్రతి గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి అందరికీ సహాయం అందించే కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ఇంతకు ముందూ ఇదే చేశామని... ఇప్పుడు కూడా అదే చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వారం రోజుల తర్వాత తాను వస్తానని.. గ్రామాల్లో తిరిగినప్పుడు తమకు రావాల్సిన సాయం అందలేదనే మాట ఎవరైనా అంటే అది బాగుండదని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. సచివాలయ వ్యవస్థ నుంచి వాలంటీర్‌ వ్యవస్థ దాకా యాక్టివేట్‌ చేసి ఏ ఒక్కరూ సాయం అందకుండా ఉండటానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కలెక్టర్లను పిలిచిన వెంటనే వచ్చారా, అందుబాటులో ఉన్నారా అని ప్రజలను అడిగారు. 


ప్రజలు పిలిచిన వెంటనే ఎంతటి అధికారి అయినా వచ్చి మంచి చేసేందుకు తాపత్రయ పడే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటూ గొప్పగా చెప్పుకొచ్చారు. పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం తెలుపుతుందన్నారు. పోలవరం పరిహారం కేంద్రం స్వయంగా చెల్లించినా ఫర్వాలేదని చెప్పారు. బాధితులకు రావాల్సిన ప్యాకేజీపై మంచి జరుగుతుందని వెల్లడించారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయపరమైన ప్యాకేజీ అందుతుందని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో లీడార్ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. తమ సంకల్పం ప్రజలకు న్యాయం చేయడమేనని చెప్పుకొచ్చారు. 


మొత్తం మూడు దశల్లో పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతామని సీఎం జగన్ వెల్లడించారు. ఒక్కసారిగా నింపితే డ్యాం కూలిపోవచ్చని.. సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతామన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆదేశాల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదన్నారు. ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించారని చెప్పుకొచ్చారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని సూచించారు. బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చామన్నారు. నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ వివరించారు. అధికారులు వారం రోజుల పాటు గ్రామాల్లోనే ఉన్నారని స్పష్టం చేశారు. 


వరద బాధితులకు నిత్యావసరాలు అందించామన్నారు. ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ. 10 వేలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. అందరికీ రెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశామని.. వరద సాయం అందుకుంటే ఇక్కడకు వచ్చి తనకు చెప్పండని అన్నారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే తమ తాపత్రయం అని.. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం తమ ప్రభుత్వానికి లేదన్నారు. అనంతరం కుక్కునూరు మండలం గొమ్ముగూడెం సందర్శించనున్నారు. సాయంత్రం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.