Plastic Ban At Annavaram Temple: 
కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి కొండపై ప్లాస్టిక్ ను నిషేధించారు. మంగళవారం నుంచి ఇది అమలులోకి వస్తుందని సత్యనారాయణ స్వామి ఆలయ ఈవో ఆజాద్ తెలిపారు. కొండపైన ప్లాస్టిక్ కు సంబంధించి వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు కొండపై దుకాణాల్లో గాజు, మొక్కజొన్న గింజలతో తయారు చేసే సీసాల్లో మాత్రమే నీటిని విక్రయిస్తారన్నారు. 'గాజు సీసాలో నీరు 750 (ఎంఎల్) కూలింగ్ ఛార్జీతో కలిపి రూ.60కి విక్రయిస్తారు. ఖాళీ బాటిల్ ను దుకాణంలో తిరిగి ఇస్తే రూ. 40 వెనక్కి ఇస్తారు అని వెల్లడించారు. 


మొక్కజొన్న గింజలతో తయారు చేసిన సీసాలో నీటిని రూ.40 విక్రయించేందుకు అనుమతిచ్చాం అన్నారు. కొండపై పలు ప్రదేశాల్లో జల ప్రసాదం ప్లాంట్లు ఏర్పాటు చేశాం. మూత తెరవని శీతల పానీయాల సీసాలు మాత్రమే కొండ పైకి అనుమతిస్తాం. వీటిలో తాగు నీటిని తీసుకురాకుండా తనిఖీలు చేస్తామన్నారు. వివాహాల సమయంలో కూడా ఈ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.500 జరిమానా 'విధిస్తాం అని ఆయన పేర్కొన్నారు. ఈవోతో సహా, సిబ్బంది అంతా తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.