Andhra Pradesh: ఆంధ్ర రాష్ట్రానికి ప్రధాని మోదీ చాలా అన్యాయం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, ప్యాకేజీలు ఇలా ఏ ఒక్కటి ఇవ్వలేదని తెలిపారు. విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ బీజేపీకి తొత్తులుగా మారారంటూ వ్యాఖ్యానించారు. కీలకమైన గంగవరం పోర్టును అదానీకి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మోడీ స్పందించాలని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్.. మోదీని గెలిపించాలని ఎందుకు అంటున్నాడని ప్రశ్నించారు. రాష్ట్రానికి మోదీ అన్యాయం చేశాడని ఆరోపించారు. చంద్రబాబు సింగపూరు చేస్తానన్నారని.. ఇప్పుడు ఏం చేశారని దుయ్యబట్టారు. జగన్ బెస్ట్ సీఎం అనిపించుకుంటానని చెప్పి వరస్ట్ సీఎంగా తయారయ్యారని విమర్శించారు.


జయసుధ క్రైస్తవులను రక్షించడానికి బీజేపీలో చేరానని చెప్పడం దారుణం అని కేఏ పాల్ పేర్కొన్నారు. బీజేపీలో చేరడం దేవుని ద్రోహి, క్రీస్తు ద్రోహి అంటూ కామెంట్లు చేశారు. 50 కోట్ల కోసమే ఆమె పార్టీలో చేరిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేద్దామని అన్నారు. స్టీల్ ప్లాంటిని సాధించుకుందామని ప్రజలకు చెప్పుకొచ్చారు. అలాగే సగం పూర్తయిన రాజధానిని కూడా కట్టలేకపోయారని ఫైర్ అయ్యారు. తాను విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు కేఏ పాల్ వెల్లడించారు. అలాగే జేడీ లక్ష్మీ నారాయణ కడప నుండి పోటీ చేస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ పోటీ చేస్తుందని.. విశాఖ ఎంపీగా తాను కచ్చితంగా అధికారంలోకి వస్తానని జోస్యం చెప్పారు. 


నిన్నటికి నిన్న కోనసీమ జిల్లాలో కేఏ పాల్ పర్యటన


ఆంధ్రప్రదేశ్ లో పాలన మారాలంటే పాల్ రావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో కోతకు గురవుతున్న భూములను ఆ ప్రాంత రైతులతో కలిసి పరిశీలించారు. ప్రతి ఏడాది గోదావరికి వచ్చే వరదల వలన సారవంతమైన లంక భూములు పదుల సంఖ్యలో ఎకరాలు కోతకు గురై రైతులు ఆందోళన చెందుతుంటే ఈ ప్రభుత్వాలకు చీమైనా కుట్టడం లేదని దుయ్యబట్టారు. ఈ భూములు చాలా విలువైనవని, ఐదు ఎకరాలు అమ్మితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బుతో గోదావరి వెంబటి ఉన్న లంక పొలాలు నది కోతకు గురవకుండా పూర్తిస్థాయిలో గ్రోయన్స్ నిర్మించవచ్చని అన్నారు. ఈ చిన్నపాటి సూత్రాన్ని కూడా ఈ ప్రభుత్వాలు తెలుసుకోలేకపోవడం చాలా ఘోరమని విమర్శించారు. 


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల గోస అవసరం లేదని వారి విలాసాలకే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అన్నారు. ప్రజలు ఓట్లను అమ్ముకుంటే ఇలాంటి పరిస్థితులే చూడవలసి వస్తుందని అన్నారు. ఎలాగైనా గెలవాలనే సిద్ధాంతాన్ని నమ్మే ఎన్నికల సమయంలో అవినీతి సొమ్మును ప్రజలకు పంచుతున్నారని అన్నారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీని విడిచి బయటకు వచ్చి ప్రజాశాంతి పార్టీతో కలిసి పోటీ చేయాలని అన్నారు. ‘‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోదీని గెలిపించమని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి వెళ్లి మోదీకి మసాజ్ చేస్తారు. మన ఆస్తుల్నే వాళ్లు దోచుకుంటున్నారు. 8 లక్షల కోట్ల విలువ చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంటును అంబానీ, ఆదానికి 5 వేల కోట్లకి ఇచ్చేయబోయారు. నేనే ఆపాను. పోరాడుతున్నాను. అధికారంలో లేనప్పుడు ఇంత చేశాను. ఇప్పటికే లక్ష కోట్లు తెస్తానంటే నన్ను తేనివ్వడం లేదు. మీడియా వాళ్లు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. కానీ, ఈ రాజకీయ నాయకులు పట్టించుకోట్లేదు’’ అని కేఏ పాల్ అన్నారు.