మావోయిస్టు అగ్ర‌నేత హిడ్మా, అతని భార్య రాజేతో పాటు టెక్‌శంక‌ర్, ప‌లువురు మావోయిస్టుల‌ భారీ ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యంలో భార‌త్ బంధ్ ప్ర‌క‌టించడంతో అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని  ఏజెన్సీ ప్రాంతం అయిన రంప‌చోడ‌వ‌రం డివిజ‌న్‌లో హై అలెర్ట్ ప్ర‌క‌టించారు పోలీసులు.. ఇటీవ‌లే మారేడుమిల్లి అటవీ ప్రాంతం జరిగిన రెండు భారీ ఎన్కౌంటర్ ల నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు పోలీసులు.. 

ఏజెన్సీ ప్రాంతాల‌ను వ‌దలివెళ్లాల‌న్న పోలీసులు..

రంప‌చోడ‌వ‌రం కూట‌మి పార్టీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా శిరీషా దేవి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదేవిధంగా వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్సీగా అనంత‌బాబు,  ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి రంప‌చోడ‌వ‌రం ప‌రిధిలోనే ఉంటుండ‌డంతో దీంతో పోలీసులు వారిని అప్ర‌మ‌త్తం చేశారు. రంప‌చోడ‌వ‌రం డివిజ‌న్ ప‌రిధిలోకి వ‌చ్చే మారేడుమిల్లిలో రెండు భారీ ఎన్ కౌంట‌ర్లుతో మావోయిస్టుల‌కు కోలుకోలేని దెబ్బ‌తగిలిన‌ట్ల‌య్యింది.. దీనికి తోడు పార్టీ అగ్ర‌నేత హిడ్మా మృతిచెంద‌డం మ‌రింత దెబ్బ త‌గిలిన‌ట్ల‌య్యింది.. ఇది ముమ్మాటికీ బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్ అని ఓ లేఖ విడుద‌ల ఏసిన మావోయిస్టు పార్టీ ఆదివారం భార‌త్ బంద్ ప్ర‌క‌టించింది. 

మావోయిస్టుల ప్ర‌తీకార చ‌ర్య‌లు ఉండ‌వ‌చ్చ‌న్న అనుమానంతో పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్ర‌మ‌త్తం అయ్యింది... దీంట్లో భాగంగా రంప‌చోడ‌వ‌రం డివిజ‌న్ ప‌రిధిలో ప్ర‌జాప్ర‌తినిధులుగా కీల‌క నేత‌లైన ఎమ్మెల్యే శిరీషాదేవి, ఎమ్మెల్సీ అనంత‌బాబు, ఎస్సీ క‌మిష‌న్ సోళ్ల బొజ్జిరెడ్డిని ఏజెన్సీ ప్రాంతాన్ని వీడివెళ్లాల‌ల‌ని సూచించారు. తాజా ప‌రిస్థితిని వారికి వివ‌రించారు. రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తోపాటు ఈప్రాంతాల్లో ఉండే కాంట్రాక్ట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ నోటీసులు జారీ చేశారు. 

రాత్రి నుంచే అటువైపుగా రాక‌పోక‌లు నిలిపివేత‌..

ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్ర నేతలు మాడవి హిడ్మా, మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతి చెందిన నేప‌ధ్యంలో మావోయిస్టులు నిర‌స‌న దినం పాటించాల‌న్న పిలుపుతో మారేడుమిల్లి మీదుగా భ‌ద్రాచ‌లం వెళ్లే బ‌స్సుల‌ను దారి మ‌ళ్లించారు. జగదల్ పూర్ వెళ్లే 30 నెంబర్ జాతీయ రహదారిపై శ‌నివారం నుంచి రాకపోకలు నిలిపివేశారు. రాత్రివేళ ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రభుత్వ వాహనాలను, అధికారుల రాక‌పోక‌ల‌ను పూర్తిగా నిలిపివేశారు పోలీసులు.. చింతూరు భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సులు కూనవరం మీదగా మళ్లీంచారు. 

త‌నిఖీలు ముమ్మ‌రం చేసిన పోలీసులు...

మావోయిస్టుల నిర‌స‌న దినం సంద‌ర్భంగా పోలీసులు త‌నిఖీల‌ను మ‌రింత ప‌టిష్టం నిర్వ‌హిస్తున్నారు.  మన్యం ప్రాంతంలో హైఅలెర్ట్ ఉంద‌న్న సంగ‌తి తెలియ‌ని ప‌ర్యాట‌కులు కార్తీక మాసం సంద‌ర్భంగా చాలా మంది త‌ర‌లివ‌స్తుండ‌గా వారిని వెన‌క్కు తిప్పి పంపిస్తున్నారు. మారేడుమిల్లి ఆవాస ప్రాంతాల‌ను దాటి ముందుకు వెళ్ల‌నీయ‌డంలేదు. అంతేకాకుండా ఇటువైపుగా వ‌స్తున్న వాహ‌నాల‌ను ఎక్క‌డిక్క‌డే త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.. మొత్తం మీద ప్ర‌శాంతంగా ఉండే మారేడుమిల్లిలో మాత్రం ఇటీవ‌ల జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యంలో హై అలెర్ట్ నెల‌కొంది..