Eluru Railway Station | పైన మీరు చూసిన ఫోటో ఏదో గుడిది అనుకుంటే పొరబాటే. అది ఏలూరు రైల్వే స్టేషన్. పూర్తిగా ట్రెడిషనల్ లుక్ లో ఏలూరు కి దగ్గర్లోని ద్వారకా తిరుమల ఆలయ గోపురాన్ని తలపించేలా రైల్వే స్టేషన్ ను నిర్మిస్తున్నారు.
స్థానిక కల్చర్ కనిపించేలా రైల్వే స్టేషన్ ల నిర్మాణాలు
"అమృత్ భారత్ స్టేషన్ " స్కీమ్ క్రింద దేశం లోని చాలా రైల్వే స్టేషన్ లను డెవలప్ చేస్తోంది కేంద్రం. ఒకప్పుడు రైల్వే స్టేషన్ ఆంటే గుర్తు వచ్చే పాడుబడిన భవనాలు, అపరిశుభ్రం గా ఉండే పరిసరాల స్థానం లో కోట్లు ఖర్చు పెట్టి పూర్తిగా న్యూ లుక్ ఇస్తుంది రైల్వే శాఖ. ఇప్పటికే కొన్ని స్టేషన్ లు రెడీ అయ్యాయి. మరికొన్ని స్టేషన్ ల ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
అయితే ఈ నిర్మాణాల సమయం లో లోకల్ కల్చర్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆమధ్య పూర్తిగా డెవలప్ చేసిన సూళ్లూరు పేట రైల్వే స్టేషన్ కు దగ్గర్లోని చెంగాలమ్మ గుడి ని తలపించే ఎలివేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏలూరు స్టేషన్ కు ద్వారకా తిరుమల టెంపుల్ లుక్ ఇస్తున్నారు.
ఏలూరు కి దగ్గర్లోనే ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న తిరుపతి (ద్వారకా తిరుమల ) కి వెళ్లాలంటే ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ ఆగేది ఏలూరు స్టేషన్ లోనే. 20 కిమీ దూరం లో ఉన్న భీమడోలు స్టేషన్ లో అన్ని రైళ్ళూ ఆగవు. అందుకే ద్వారకా తిరుమల వెళ్లే భక్తులకు ఏలూరు స్టేషన్ లో దిగడమే బెస్ట్ అప్షన్ గా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఏలూరు రైల్వే స్టేషన్ కు ఆ డివోషనల్ టచ్ ఇస్తున్నారు. ఇది పూర్తి అయితే ఏలూరుకు ఒక ఐకానిక్ బిల్డింగ్ గా మారుతుంది అంటున్నారు అక్కడి ప్రజలు.
కోచ్ ల సంఖ్య.... కొన్ని సౌకర్యాలు పెంచండి : ప్రయాణికుల విజ్ఞప్తి
ఈ మధ్యనే ఏలూరు స్టేషన్ లో అమృత్ సంవాద్ పేరిట స్థానికుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంది సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ అధికారుల బృందం. ఆ సందర్భంగా రైళ్లకి కొన్ని అదనపు కోచ్ లను ఏర్పాటు చెయ్యాలని.. స్టేషన్ లో కొన్ని అదనపు సౌకర్యాలు పెంచాలని ప్రయాణికులు కోరారు.