Eluru Mayor Noorjahan resigned to YSRCP likely to Join TDP soon | ఏలూరు: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో మంగళవారం (ఆగస్టు 27న) మేయర్‌ దంపతులు టీడీపీలో చేరనున్నారని సమాచారం. మేయర్ నూర్జహాన్ దంపతులతో పాటు పలువురు ఏలూరు కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఒకవేళ ఏలూరు మేయర్‌ సహా కార్పొరేటర్లు చేరితే ఓవైపు వైసీపీ బలహీన పడుతోంది. మరోవైపు అధికార కూటమి టీడీపీ ఏలూరు నగర పాలక సంస్థపై పట్టు బిగించనుంది.


సొంత గూటికి మేయర్ దంపతులు
ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి వెళ్లి ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలోగానీ, చంద్రబాబు సమక్షంలోనైనా మేయర్ దంపతులు టీడీపీలో చేరే అవకాశం ఉంది. చంద్రబాబు, లోకేష్ లపై మేయర్‌ భర్త ఎస్‌ఎంఆర్‌ పెదబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరు సమర్థత కలిగిన నేతలు అని, వీరి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే చంటి నాయకత్వంలో ఏలూరును అభివృద్ధి చేస్తామన్నారు. మేయర్ దంపతుల ప్రస్థానం టీడీపీలోనే మొదలైంది. గతంలో నూర్జహాన్‌ మేయర్ గా అయ్యారు. ఈ క్రమంలో 2019 ఎన్నికలకు ముందు మేయర్ దంపతులు వైసీపీలో చేరారు. అనంతరం మరోసారి మేయర్ గా ఎన్నికయ్యారు. ఇటీవల ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడంతో మేయర్ దంపతులు తిరిగి టీడీపీ లోకి రానున్నారు.