Rajahmundry News: ఆధునిక చిత్రకళ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు కేరళకు చెందిన రాజా రవివర్మ. ఆయనతో సమానమైన ప్రతిభ ఉన్న తెలుగు చిత్రకారుడు దామెర్ల రామారావు. ఈయన గురించి తెలిసినవాళ్లు మాత్రం తెలుగువాళ్లలోనే తక్కువ మంది ఉంటారు. కానీ ఇప్పటికీ ఆయన గీసిన చిత్రాలు లండన్, పారీస్ లాంటి ప్రాంతాల్లో భద్రపరచే ఉన్నాయంటే ఆయన గొప్పతనం అర్థమవుతుంది. రాజమండ్రిలో పుట్టి పెరిగిన దామెర్ల రామారావు చిత్రకళ అనితర సాధ్యమని కళాకారులు చెబుతుంటారు.


సింగిల్ స్ట్రోక్ ఆర్టిస్ట్ 
దామెర్ల రామారావు రాజమండ్రిలో 1897లో పుట్టారు. ఆయన తండ్రి వెంకటరమణ అప్పట్లో ప్రముఖ వైద్యుడు. తన మేనమామ డ్రాయింగ్ టీచర్ కావడంతో ఆయన ప్రభావం దామెర్ల రామారావుపై పడింది. బొగ్గుతో గోడలపై బొమ్మలు గీస్తూ ఉండే రామారావు ప్రతిభ గుర్తించిన అప్పటి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఆస్వాల్డ్ కూల్డ్రే దామెర్ల రామారావుకి శిక్షణ ఇచ్చారు. సొంత డబ్బులతో ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కి 1916లో పంపించారు. రామారావు వేసిన పెయింటింగ్స్ చూసి అక్కడి ప్రిన్సిపల్ సిసిల్ బర్న్స్ ఆశ్చర్యపోయి ఇది ఒక ప్రత్యేకమైన ఆర్ట్ ఫామ్‌గా గుర్తించారు. రామరావును డైరెక్ట్‌గా థర్డ్ ఇయర్‌లో చేర్చుకున్నారు. 


ఆ టైంలో రామారావు వేసిన పెయింటింగ్స్ బ్రిటిష్ వైస్రాయ్ హార్ట్ రీడింగ్ వరకు చేరుకున్నాయి. ముంబై, కలకత్తా లాంటి నగరాలతోపాటు బరోడా, నిజాం లాంటి రాజసంస్థానాల్లోనూ రామారావు పెయింటింగ్స్‌ని ప్రదర్శనకు పెట్టడం మొదలైంది. చదువు పూర్తి అయిన తర్వాత అదే జేజే స్కూల్ అఫ్ ఆర్ట్స్‌లో వైస్ ప్రిన్సిపల్‌గా ఉద్యోగం ఇచ్చారు రామారావుకు. కానీ స్వస్థలం రాజమండ్రిలో తన విద్యను అందరికీ అందుబాటులో ఉంచుతానని ఆయన రాజమండ్రి వచ్చేశారు. అక్కడే చిత్రకళ మందిరం ప్రారంభించి ఉచితంగా తన పెయింటింగ్ ఆర్ట్‌ను నేర్పడం మొదలుపెట్టారు. 





రామారావు గీసిన సీతారామ వనవాసం, సీమంతం, బావి వద్ద, సిద్ధార్థ రాగోదయం లాంటి చిత్రాలు బ్రిటిష్ ఎంపైర్ మొత్తం ఎగ్జిబిషన్‌లలో ఉంచేవారు. వైశ్రాయ్ మెడల్స్ సైతం దామెర్లకు లభించింది. రాజమండ్రిలో ఉంటూనే దేశమంతా తిరుగుతూ తన గీసిన చిత్రాలను వివిధ రాజుల ఆహ్వానం మేరకు వారి ఆస్థానాల్లో ప్రదర్శనకు పెట్టేవారు. 1925లో అలా ఒక ఎగ్జిబిషన్ కోసం ముంబై వెళ్లి చికెన్ పాక్స్ వ్యాధికి గురయ్యారు దామెర్ల. దానితోనే రైలులో ప్రయాణిస్తూ రాజమండ్రి వచ్చేసరికి అది ముదిరిపోయి 28 ఏళ్ల చిన్న వయసులో మరణించారాయన. 




గాంధీజీ ప్రారంభించిన దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ
మరణించే నాటికి దామెర్ల రామారావు వేసిన 129 వాటర్ కలర్ పెయింటింగ్స్, 250 పెన్సిల్ స్కెచ్‌లు, 34 ఆయిల్ పెయింటింగ్స్, 28 స్కెచ్ బుక్కులతో ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రిలోని వంకాయల వారి వీధిలో ఒక చిత్ర కళామందిరాన్ని ఏర్పాటు చేశారు.  దీనిని గాంధీజీ స్వయంగా ప్రారంభించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత దీనిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని రాజమండ్రి గోకవరం బస్టాండ్ సమీపంలో ఒక ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించింది. దేనిని దుర్గాబాయి దేశ్ ముఖ్ ఓపెన్ చేశారు. ఇప్పటికీ ఈ చిత్రకళ మందిరం అక్కడే ఉంది. ప్రవేశం ఉచితం. స్కూల్ స్టూడెంట్స్, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తూ ఉంటారు. 




ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండర్‌లో ఉన్న ఈ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్స్ కనపడేలా సరైన లైటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే భారతదేశం గర్వించదగ్గ గొప్ప చిత్రకారుడు ప్రతిభ ఈ జనరేషన్ కి అందకుండా కాలగర్భంలో కలిసి పోయే ప్రమాదం ఉంది