AP News Updates: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh News)లో రెండో విడత నామినేటెడ్ పోస్టుల(Nominated Posts In AP) భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొలి దఫాలో 20 కార్పొరేషన్లకు ఛైర్మన్‌లను నియమించారు. వీటిలో టిడిపి(Telugu Desam News) నుంచి 16 మంది, జనసేన(Jana Sena News) నుంచి ముగ్గురు, బీజేపీ(BJP News) నుంచి ఒకరికి ఛాన్స్ ఇచ్చారు. కొనకళ్ళ నారాయణ, పీతల సుజాత, దీపక్ రెడ్డి, రవి నాయుడు లాంటి వాళ్లకు నామినేటెడ్ పోస్టులు దక్కాయి. వివిధ బోర్డుల్లో మెంబర్లుగా 99 మందికి అవకాశం వచ్చింది. మూడు వారాల తర్వాత రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల పదో తారీఖున జరగాల్సిన కేబినెట్ భేటీ పూర్తవ్వగానే లిస్టు బయటకు వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అదే రోజు రతన్ టాటా చనిపోవడంతో క్యాబినెట్ భేటీని క్లుప్తంగా ముగించేసి చంద్రబాబు లోకేష్ ముంబై వెళ్లారు. ఆ రోజు జరగాల్సిన క్యాబినెట్ సమావేశం ఇవాళ (అక్టోబర్ 16) జరగనుంది. ఇది ముగిశాక రెండో విడత నామినేటెడ్ పోస్టులు భర్తీపై చంద్రబాబు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ లిస్టు కోసం ఎదురుచూస్తున్న వాళ్ళలో కీలక నేతలతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు. 


తొలివిడత పోస్టులపై నేతల్లో అసంతృప్తి 
మూడు వారాల క్రితం విడుదల చేసిన తొలి జాబితాపై కొంత అసంతృప్తి సొంత పార్టీ నుంచే వినిపించింది. టిడిపి విపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు అనుభవించిన కీలక నేతలను పక్కన పెట్టారనే అభిప్రాయం చాలా మందిలో కలిగింది. పదవులు ఆశించిన చాలామంది తమనను పక్కన పెట్టారనే అసంతృప్తిని స్నేహితుల వద్ద వెళ్ళబుచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పట్టాభి, ప్రతిరోజు మీడియా ముందు టిడిపి వాయిస్ వినిపించిన జీవీ రెడ్డి, మాజీ మంత్రులు దేవినేని ఉమా, కేఎస్ జవహర్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, టిడిపి మీడియా విభాగం బాధ్యతలు వహిస్తూ పోలీసు కేసులు ఎదుర్కొన్న నరేంద్ర లాంటి వారు ఉన్నారు. వీరే కాకుండా సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకి కూడా కీలక బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ఉంది. వీటన్నిటికంటే ముందు తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్‌ను నియమించాల్సి ఉంది. ఈ పోస్టు కోసం చాలామంది ముఖ్యులు పోటీ పడుతున్నారు. టిటిడి చైర్మన్ లేకుండానే బ్రహ్మోత్సవాలు కూడా జరిగిపోయాయి.


కూటమి కోసం సీట్లు త్యాగం చేసిన వారికి పెద్ద పీట: టీడీపీ 
ఎన్నికల సమయంలో కూటమి కోసం సీట్లు త్యాగం చేసిన నేతలకు నామినేటెడ్ పోస్టులు లేదా మంచి పదవులు ఇస్తామంటూ అప్పట్లో టీడీపీ వాగ్దానం చేసింది. అలాంటి వారిలో పిఠాపురం వర్మ ముఖ్యుడు.  పవన్ కల్యాణ్ కోసం ఆయన తన సీటు త్యాగం చేశారు. కాబట్టి తొలి విడతలోనే ఆయనకు పదవి వస్తుందని భావించినా అది సి. రామచంద్రయ్యకు దక్కింది. కాబట్టి రెండో విడతలో తనకు పదవి కన్ఫర్మ్ అనే నమ్మకంతో వర్మ ఉన్నారు. నిజానికి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కట్టబడతానని చంద్రబాబు వాగ్దానం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమైన నామినేటెడ్ పోస్ట్ కట్టబెడుతున్నట్టు సమాచారం. వర్మతోపాటు కూటమి కోసం తమ సీట్లు త్యాగం చేసిన టిడిపి నేతలకు రెండో విడత నామినేటెడ్ పోస్టుల్లో పదవులు దక్కనున్నాయి. ఈ రెండు రోజుల్లోనే లిస్ట్ విడుదల చేస్తారా లేక దీపావళి అయిన తర్వాత ప్రకటిస్తారా అనేది ప్రస్తుతానికి చంద్రబాబు చేతుల్లోనే ఉంది.


Also Read: స్కిల్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లే - జగన్ హయాంలో పెట్టింది తప్పుడు కేసు అని తేలిపోయిందా ?