Indiramma Committees : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన ద్వారా పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి ఇందిరమ్మ కమిటీలను ఓ అవకాశంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. కాస్త ఆలస్యమైనా ఇందిరమ్మ కమిటీల ఏర్పాటును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల నాటికి గ్రామాలన్నింటిపై ఇందిరమ్మ కమిటీల ప్రభావం ఉండేలా చూసుకోనున్నారు. అంటే.. ప్రతి ప్రభుత్వ లబ్దిదారుడు కాంగ్రెస్ ను దాటిపోడు. అంతే కాదు ఇతర కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లనూ చేజారిపోకుండా చూసుకోవచ్చు. 


పథకాలన్నీ ఇందిరమ్మ కమిటీల ద్వారానే ప్రజలకు చేరిక 


రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరవాత ఇందిరమ్మ కమిటీల ప్రస్తావన తెచ్చారు. ప్రభుత్వ ప్రతి పథకం ప్రజలకు ఇందిరమ్మ కమిటీల ద్వారానే చేరుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని పార్టీని ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా చేయాలని ఆయన అనుకున్నారు. కారణం ఏమైనా తర్వాత ఆలస్యం జరిగింది. రుమమాఫీని ప్రకటించారు. హడావుడిగా అమలు చేశారు.  కానీ ఆ రుణమాపీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం సరిగ్గా జరగలేదు. ఇందిరమ్మ కమిటీలు ఉంటే నేరుగా ఇంటింటికి తీసుకెళ్లేవారు. ఆలస్యంగా అయినా ఇప్పుడు ఇందిరమ్మ  కమిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కమిటీ చేతుల మీదుగానే ఇళ్ల నిర్మాణ పథకానికి లబ్దిదారులను ఎంపిక చేయబోతున్నారు. 


ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !


స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇందిరమ్మ కమిటీలకే గ్రిప్


స్థానిక సంస్థల ఎన్నికల్ని ఇప్పటికే నిర్వహించాల్సి ఉంది. కానీ కులగణన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పుడు ప్రక్రియను ప్రారంభించారు. నివేదిక వచ్చిన తర్వాత ఇతర చట్టపరమైన పనులు పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలంటే మరో నాలుగైదు నెలల సమయం పట్టవచ్చు. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ పాలక మండలులు గడువు మాత్రమే ఇప్పటికి ముగిసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గడువు మరో ఏడాది వరకూ ఉంది. అన్నీ ఒకే సారి పెట్టేద్దామని అనుకుంటే.. మరో ఏడాది తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అప్పటికి ఇందిరమ్మ కమిటీ గ్రామాల్లో పట్టు సాధించే అవకాశం ఉంది. 


సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు, అసలేం జరిగింది?


ఆ కమిటీల పట్ల ప్రజా వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి !


నిజానికి ఇందిరమ్మ కమిటీలు వంటి ఏర్పాటు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. ఎందుకంటే ఎంత ప్లస్ ఉంటుందో అంత మైనస్ ఉంటుంది. ఈ కమిటీల సభ్యులు ప్రజలతో పారదర్శకంగా వ్యవహరించారు. అర్హులైన లబ్దిదారులను మాత్రమే ఎంపిక చేయాలని ఎక్కడైనా పక్షపాతం చూపించినట్లుగా ఆరోపణలు వస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అందుకే ఇందిరమ్మ కమిటీల సభ్యుల్లో కీలకమైన వ్యక్తుల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు సర్పంచ్‌లు లేరు కాబట్టి స్పెషలాఫీసర్లే కమిటీ చైర్మన్ గా ఉంటారు. అయినా పార్టీ నేతల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఈ కమిటీలపై వ్యతిరేక ప్రచారం సహజంగానే జరుగుతుంది. కానీ ప్రజలు నమ్మకంగా ఉండేలా చూసుకోవడం ఆ కమిటీల మీదనే ఆధారపడి ఉంటుంది. అంతా సాఫీగా సాగితే కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని ఇందిరమ్మ కమిటీలు మరింత బలోపేతం చేస్తాయని అనుకోవచ్చు.