గోదావరి వరదల్లో ఇకపై భారీ నష్టం జరగకుండా శాశ్వత పనులు చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. మీడియాలో వస్తున్న కథనాలపై అప్రమత్తంగా ఉండాలన్న సీఎం జగన్.. తప్పుడు ప్రచారం చేస్తే దీటుగా తిప్పికొట్టాలన్నారు. లేకుంట్ తప్పు సరిదిద్దుకోవాలని సూచించారు. 


గోదావరి వరద ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... గోదావరి వరదల దృష్ట్యా శాశ్వతంగా తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్నారు. 1986 వరద తర్వాత ఆ స్థాయిలో గోదావరికి దాదాపుగా 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కనిపించిందని గుర్తు చేశారు. రాజమండ్రికి సంబందించి శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 


ఎన్యూమరేషన్‌ చేసిన తర్వాత సోషల్‌ ఆడిట్‌లో మిస్‌ అయిన వారికి సాయం అందివ్వాలన్నారు. – అంతా పారదర్శకంగా ఉండాలి, ఎవరూ నష్టపోకూడదన్న సీఎం జగన్... నిరంతరం ఇస్తున్న ఆదేశాల మేరకు జిల్లాల్లో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా వ్యవహరించిందన్నారు. 


సచివాలయ సిబ్బంది, వలంటీర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ముంపు ప్రమాదం ఉన్నవారిని అప్రమత్తంచేశారని అధికారులు వివరించారు. సహాయక కార్యక్రమాల కోసం అవసరమైన నిధులను వెంటనే సమకూర్చారని, దీనివల్ల మంచి సేవలు అందించగలిగామని సీఎంకు తెలిపారు అధికారులు. పశువులకు కూడా వెంటనే గ్రాసం అందజేశామన్నారు. శానిటేషన్‌పై కూడా దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు. మెడికల్‌ క్యాంప్‌లు కూడా రెడీగా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని వివరించారు. 


బాధితులకు సహాయం చేయడంలో ఉదారంగా ఉండాలన్న ముఖ్యమంత్రిగారి సూచనను పరిగణలోకి తీసుకుని మరింత ఎక్కువ మందికి సాయం చేయగలిగామన్నారు అధికారులు. గ్రామ సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్ధ లేకపోతే తాము చాలా ఇబ్బంది పడేవాళ్ళమని పునరుద్ఘాటించారు. రిలీఫ్‌ క్యాంపులలో బాధితులకు నాణ్యమైన భోజనం అందజేశామని... సీఎం చెప్పిన సూచనల మేరకు చక్కటి ఆహారాన్ని ఇచ్చామన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ముందస్తుగా పునరావాసాల కోసం సాయం అందించలేదనియ... జగన్ హయాంలోనే ఇదంతా చూస్తున్నామన్నారు అధికారులు.


అధికారు వివరణ విన్న సీఎం జగన్... లంక గ్రామాల్లో నష్టతీవ్రతపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. అందరితో మమేకమై సహాయక చర్యలు కొనసాగించాలని... ఎక్కడా నిర్లిప్తంగా ఉండొద్దని సూచించారు. గతంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కొంతమంది అధికారులను బాధ్యులుగా చేసి సస్పెండ్‌చేసి హడావిడి చేసేవారని గుర్తు చేశారు. విపత్తుల సమయంలో నాయకుల చుట్టూ తిరుగుతూ ఉండడంవల్ల పనుల్లో జాప్యం జరిగేదని అభిప్రాయపడ్డారు. 


అధికారులను ఎంపవర్‌ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు సీఎం జగన్. వలంటీర్, సచివాలయం వ్యవస్థ వల్ల ఫలితాలు అందరికీ అందుతున్నాయని... ఆ తర్వాత తాను రావడం వల్ల అన్నీ సవ్యంగా జరిగాయా?లేదా?అని తెలుసుకుంటున్నట్టు వివరించారు. తాను కూడా వరదల సమయంలో వచ్చి ఉంటే.. తన చుట్టూ తిప్పించుకొని నలుగురిని సస్పెండ్‌ చేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. ఫైనల్‌గా ప్రజలకు మంచి జరగాలని... వారికి సాయం అందాలన్నారు. 


ప్రతీ అధికారి మరి ముఖ్యంగా అందరూ లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులంతా బ్రహ్మండంగా చేశారు కాబట్టే ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా చూసుకున్నారన్న మాట వినిపిస్తుందని కితాబు ఇచ్చారు. అందరు అధికారులకు అభినందనలు తెలిపారు. మున్ముందు కూడా ఇదే మంచి పేరు నిలబెట్టుకునేలా పని చేయాలన్నారు. శానిటేషన్‌ పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 


ఎన్యూమరేషన్‌ విషయంలో మరింత పారదర్శకంగా, కచ్చితంగా చేయాలన్నారు. రెండు వారాల్లో ఇదంతా పూర్తిచేసి తర్వాత సోషల్‌ ఆడిట్‌ పెడదామని తెలిపారు సీఎం. పారదర్శకంగా ఉండడంలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నామని అభిప్రాయపడ్డారు. ఏ సీజన్‌లో జరిగిన నష్టం ఆ సీజన్‌ ముగిసేలోగా ఇవ్వగలిగితే ప్రజలు మరింత సంతోష పడతారన్నారు.  


విద్యుత్‌పునరుద్దరణపై ఆరా తీసిన సీఎం జగన్... వరద ప్రాంతాల్లో ఎక్కడా కూడా కరెంట్‌ పునరుద్దరణలో జాప్యం జరగలేదు కదా? అని ప్రశ్నించారు. దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కౌంటర్‌ ఇవ్వాలని సూచించారు. తప్పులు జరిగితే సరిచేసుకోవాలి అంతేకాని ఏం జరగకపోయినా చేస్తున్న నెగిటివ్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. 


అవ డ్రెయిన్‌ ఏర్పాటుచేయడంపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుని అంచనాలు సిద్దం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అన్ని లంక గ్రామాలలో కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణం చేస్తే విపత్తు సమయంలో పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవచ్చన్నారు. కరకట్టల ఆధునీకరణపై వెంటనే ప్రతిపాదనలు రెడీ చేయాలన్న సీఎం... డెల్టా ఆధునీకరణ, గోదావరి వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం అందజేసిన డీపీఆర్‌పై టెక్నికల్‌ ఎస్టిమేట్స్‌ తయారుచేయాలన్నారు. 


రాజమండ్రి పట్టణంలోకి ఎలాంటి వరదనీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన నివేదిక రాగానే చర్యలు ప్రారంభిస్తామన్నారు సీఎం. నిపుణులతో కూడిన టెక్నికల్‌ కమిటీని నియమించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. బండ్‌లు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి నవంబర్‌ నుంచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుందామన్నారు. శాశ్వత చర్యలపై దృష్టిపెడదామని.. నవంబర్‌ కల్లా టెండర్లు పూర్తిచేసుకుని పనులు మొదలుపెడదామన్నారు. 


టీడీపీతో చంద్రబాబుతో కాదు జరుగుతున్న యుద్ధం కాదని... నెగిటివ్‌ మీడియాతో చేస్తున్న పోరాటం అన్నారు సీఎం. మీడియా సంస్ధలు కూడా చొక్కాలిప్పుకుని ఒక పార్టీకి అధికారం కోసం పనిచేస్తున్నాయన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు. దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.