AP ACB  14400 : ఏపీలో అవినీతి నిరోధానికి సంబంధించి  అమలులోకి తెచ్చిన 14400 కాల్ సర్వీసులకు సంబంధించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వీలుగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో  డిస్ ప్లే  బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సమీర్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలో అవినీతిని అంతమొందించే లక్ష్యంతో ఆర్టీజిఎస్ సహకారంతో ఏసీబీ  ఆధ్వర్యంలో ‘14400’తో కూడిన కాల్ సర్వీసులు ,   యాప్ ను రూపొందించామని ఈ అంశంపై జరిగిన సమీక్షలో సీఎస్ గుర్తు చేశారు. జూన్‌లో సీఎం ఆవిష్కరించారని.. కానీ అనుకున్న విధంగా ప్రజల్లోకి వెళ్లలేదన్నారు. అందుకే విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతిని ప్రభుత్వం దృష్టికి అదే విధంగా అవినీతి నిరోధకశాఖ దృష్టికి తీసుకు వచ్చేందుకు ఈయాప్ ఉపయోగ పడుతుందని కావున ప్రజలు ఎక్కడైనా అవినీతి జరిగితే వెంటనే తెలియజేసేందుకు కృషి చేయాలని చెప్పారు.


"చేయి చేయి కలుపుదాం అవినీతి భూతాన్ని తరిమివేద్దాం-లంచం ఇవ్వడం,తీసుకోవడం నేరం" అనే నినాదంతో రూపొందించిన ఈ 14400 యాప్ పై ప్రజలందరికీ విస్తృతంగా తెలిసే విధంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో  డిస్ప్లే బోర్డులను 15రోజుల్లోగా ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు. ఈవిషయంలో ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలోని అన్ని గ్రామ పంచాయితీలు,గ్రామ సచివాలయాలు, మండల స్థాయిలో తహసిల్దార్,ఎండిఓ,సబ్ రిజిష్ట్రార్ తదితర కార్యాలాయాలు,డివిజన్ స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సహా జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను   బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.  14400 యాప్ ను ప్రజలు గూగుల్ ప్లే స్టోర్ నుండి రిజిష్టర్ మొబైల్ నంబరుతో డౌన్లోడ్ చేసుకోవచ్చు.


 14400 యాప్ లో రెండు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.  లైవ్ రికార్డు ఆడియో,పొటో లేదా వీడియో సౌకర్యం కలిగి ఉండి వెంటనే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది.  మరో ఫీచర్ వీడియోలు, పొటోలు,డాక్యుమెంట్లు,ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు వీలైన సౌకర్యం ఉంది .ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత మొబైల్ కు ఆ ఫిర్యాదుకు సంబంధించిన రిఫెరెన్సు వస్తుంది. ఏ ప్రభుత్వ అధికారైనా ఎక్కడైనా లంచం అడిగితే వెంటనే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఏసీపీ వెంటనే చర్యలు తీసుకుంటుంది.  


 ఇప్పటి వరకూ 14400కు వచ్చిన మొత్తం కాల్స్ లక్షా 49వేల 950 కాగా వాటిలో 8వేల 842 ఎసిబికి సంబంధించినవి.   26వేల 292 ఎసిబి కాల్ సెంటర్ పనితీరుకు సంబంధించిన ఎంక్వయిరీ కాల్స్ అని అశోక్ కుమార్ సిఎస్ కు వివరించారు. ఎసిబి కాల్ సెంటర్ కు వచ్చిన 8,842 కాల్స్ లో ఎసిబికి సంబంధించిన 8687 ను ఇప్పటి వరకూ పరిష్కరించినట్లుగా అధికారులు ప్రకటించారు.   నాన్ ఎసిబికి సంబంధించి గత మే నుండి ఇప్పటి వరకూ వచ్చిన 1261 లో 943 పరిష్కరించారు.