పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్‌ మీదుగా ఛత్తీస్‌గఢ్‌ ఒడిశా వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మరో నాలుగు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలోనూ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి.


తెలంగాణలో వాతావరణ స్థితి
తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి బలపడింది. నేడు (మార్చి 17న) నిజామాబాద్‌, జగిత్యాల, మహబూబాబాద్‌, వరంగల్‌, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, నాగర్‌ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. 


రేపు కూడా వర్షాలు
రేపు (మార్చి 18న)ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, నల్గొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.



ఏపీలో వర్షాలు ఇలా
పశ్చిమ బెంగాల్‌ నుంచి ఝార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకూ మరో ద్రోణి ఆవరించిన ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ వైపు వీటి ప్రభావం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 18న అనేక చోట్ల భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.


ఢిల్లీలోని భారత వాతావరణ విభాగం సమాచారం ప్రకారం.. ఉత్తర భారతదేశంలోని వాతావరణంలో విపరీతమైన మార్పు వచ్చింది. ఈ ఏడాది సమయానికి ముందే ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతల బలమైన ప్రభావం కనిపించింది. తాజాగా పాకిస్తాన్‌లో ఏర్పడిన తుపాను ప్రసరణ కారణంగా, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల వాతావరణంలో మార్పు వచ్చింది. దీంతో ఈ ప్రాంతాల్లో మార్చి నెలలోనే వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.