Southwest Monsoon: పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో నైరుతి బంగాళాఖాతం నుంచి సైతం 50 కిలోమీటర్ల వేగంతో తీరంలో బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.  నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం హైదరాబాద్ సహా ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నేడు (జూలై 4) ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఏపీలోని కోస్తాంధ్రలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల హెచ్చరిక, వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ ఇప్పుడు పశ్చిమ పసిఫిక్ కి వెళుతోంది. దాంతో జూలై రెండు, మూడు వారాల్లో రెండు నుంచి మూడు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. అందులో ఏదైన ఒక్కటి ఉత్తరాంధ్ర తీరం వైపుగా వచ్చే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస - టెక్కళి, అనకాపల్లి, విశాఖ​, పార్వతీపురం జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలో అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి జల్లులు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా జిల్లా గుడివాడ - కైకలూరు మీదుగా కొనసాగుతున్న వర్షాలు నేరుగా పశ్చిమ గోదావరి, నర్సాపురం నుంచి కృష్ణా జిల్లా బందరు, పెడన దాక విస్తరించనున్నాయి. కృష్ణా, విజయవాడ​, గుంటూరు, బాపట్ల, ఉత్తర ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. అయితే జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షం కురుస్తుండగా, మిగతా ప్రాంతాల్లో చినుకులు కూడా పడవు.


హెచ్చరిక: కొన్ని వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.






తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో నేడు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాద్, మణికొండ​, లింగంపల్లి, జూబ్లీ హిల్స్ తో పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.