Andhra News purandeswari :   ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో  బీజేపీ, జనసేన ( BJP Janasena )  కలిసే వెళ్తాయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. అయితే టీడీపీతో ( TDP) పొత్తు ఇతర అంశాలపై బీజేపీ అగ్రనాయకత్వం ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. వైసీపీ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేస్తామని దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం పర్యటించారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసి కక్ష పూరిత రాజకీయాలతో కాలం గడుపుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు విమర్శించారు. 


ఏపీలో స్కాంపై కేంద్రం ప్రత్యేక దృష్టి 


ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తే ఇతర పార్టీలతో సంబంధాలు అంటగట్టడం...కేసులు పెట్టి వేధించడం దారుణం అని పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు కేంద్రమే నిధులిస్తోందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం సొంతంగా చేస్తున్న పని ఒక్కటీ కూడా లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించడం విపక్షాల హక్కు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని... పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదని విమర్శించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీలో కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పురందేశ్వరి వెల్లడించారు.


ఏపీలో కలిసి పని చేసుకుంటున్న టీడీపీ, జనసేన                       


జనసేన పార్టీతో కలిసి వెళ్తామని పురందేశ్వరి చెబుతున్నప్పటికీ.. జనేసన పార్టీ మాత్రం ఇప్పటికే  టీడీపీతో పొత్తును ఖరారు చేసుకుంది. నియోజకవర్గ స్థాయి వరకూ సమన్వయం కోసం  సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు పార్టీల నేతలు కలిసి పని చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఎక్కడా బీజేపీని కలుపుకుని పోవాలని అనుకోవడం లేదు. బీజేపీ గురించి  పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు.  


తెలంగాణ ఎన్నికల తర్వాత నిర్ణయాలు ఉంటాయా ?             


తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. మొదట జనసేన ఒంటరిగా పోటీ చేయాలని  అనుకుంది. కానీ తర్వాత బీజేపీతో పొత్తుల ప్రతిపాదనలు రావడంతో అంగీకరిచింది. మొత్తంగా ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నారు. పోటీ అయితే చేస్తున్నారు కానీ.. ప్రచారాలు చేయడం లేదు. అక్కడ టీడీపీ మద్దతు ఇస్తుందో లేదో తెలియదు. అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలోనూ పొత్తుల అంశంపై బీజేపీ వైపు నుంచి కొన్ని చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లోనే ఉండే అవకాశం ఉండటంతో  వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.