PM Modi To visit Andhr Pradesh:

  అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా (Sri Sathyasai District)లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శిస్తారు. పాలసముద్రంలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ను ఆయన సందర్శించనున్నారు. అనంతరం నిర్వహించనున్న సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏర్పాట్లపై సీఎస్‌ జవహర్‌ రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్‌ కూడా పాల్గొనే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీని ఆదేశించారు.


ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం చేరుకుని అక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డెరక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్(NACIN)ను సందర్శిస్తారు. ఆ భవనం మొదటి అంతస్తులో గల యాంటీక్యూస్ (Antiques) స్మగ్లింగ్ స్టడీ సెంటర్ ను, నార్కోటిక్స్ స్టడీ సెంటర్ ను సందర్శిస్తారు. వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు.


అనంతరం ప్రధాని మోదీ గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎక్స్- రే,బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు. తదుపరి ఎకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలను నాటి అక్కడ కనస్ట్రక్సన్ కార్మికులతో మాట్లాడి వారితో గ్రూపు ఫొటో దిగుతారు. అనంతరం 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో మాటామంతీలో పాల్గొంటారు. అనంతరం పబ్లిక్ ఫంక్షన్‌లో ప్రధాని మోదీ పాల్గొని ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. తదుపరి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరక్ట్ టాక్టెస్ అండ్ నార్కోటిక్స్ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికెట్ ను అందిస్తారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించాక.. అక్కడి నుండి ఢిల్లీకి బయలుదేరి వెళతారు అని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి అధికారులు తెలిపారు.


ప్రధాని పర్యటనపై కలెక్టర్ సమీక్ష, అధికారులకు ఆదేశాలు
పుట్టపర్తి: జనవరి 16న శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ప్రధాని మోదీ (PM Narendra Modi) పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. పాలసముద్రంలోని నాసిన్ కేంద్రం వద్ద హెలిప్యాడ్, వాహనాల రాకపోకల, పలు ఏర్పాట్లపై అడ్వాన్స్ సెక్యూరిటీ లాంచ్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి కార్యాలయం భద్రత అధికారులు పీకే యాదవ్, డీఈజీ అమ్మిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, ఎస్ పి జి అధికారులు, జిల్లా అధికారులు, మోదీ పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 


స్పందన మీటింగ్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యల తీసుకోవాలని.. పర్యటన విజయవంతానికి కట్టుదిట్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 16న మధ్యాహ్నం ప్రధాని పాలసముద్రం చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటనలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రులు పాల్గొంటారని.. తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భద్రత, రవాణా, వసతి, వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. 
రెవెన్యూ శాఖ సమన్వయంతో అవసరమైన చోట్ల హోర్డింగులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ తరపున అన్ని రకాల అత్యవసర వైద్య సౌకర్యాలతో కూడిన వైద్య బృందాలను, సరిపడిన మందులను అందుబాటులో ఉంచాలని  ఆదేశించారు.  పుట్టపర్తి ఎయిర్ పోర్ట్, నాసిన్ హెలిపాడు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి జిల్లా అధికారుల తరపున పాస్ లు జారీ చేయాలని డిఆర్ఓ ను, పుట్టపర్తి ఆర్డీవోను ఆదేశించారు.