Pemmasani Chandrasekhar Profile: 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. ఈయన తొలిసారి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టగానే మోదీ 3.0 కేబినెట్‌లో చోటు దక్కింది. పెమ్మసానికి సహాయ మంత్రి పదవితో పాటు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నారు. జూన్ 9న రాత్రి 7 గంటలకు నరేంద్ర మోదీతో పాటు వీరు ఇద్దరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


పెమ్మసాని తొలిసారి ఎంపీగా గెలవగానే కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ‘యు వరల్డ్‌’ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను ప్రారంభించి, స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తూ అతికొద్దికాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది.


అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయనను కేంద్రమంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. క్యాబినెట్‌ ఎంపికలో తొలుత 10 స్థానాల కన్నా ఎక్కువచోట్ల గెలిచిన పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని, ఈ నేపథ్యంలో టీడీపీకు తొలుత రెండు మంత్రి పదవులు ఇస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో మరో 2 మంత్రి పదవులు వస్తాయని తెలుగు దేశం వర్గాలు చెబుతున్నాయి.


బుర్రిపాలెం టూ అమెరికా
గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో పెమ్మసాని చంద్రశేఖర్‌ జన్మించారు. ఇతని వయసు 47 సంవత్సరాలు కాగా ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేశారు. పెమ్మసాని తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరావు కాగా భార్య పేరు డాక్టర్‌ శ్రీరత్న. ఇతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్‌ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత వాసులకు చిరపరిచితులు. చంద్రశేఖర్‌ ఎంసెట్లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించారు.


పీజీ చదివేందుకు అమెరికా వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామ్‌ పూర్తి చేయడంలో వసతి, శిక్షణకు అధిక వ్యయభారం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో జనరల్‌ గైసింగర్‌ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటారు. అమెరికాలో లైసెన్సింగ్‌ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను స్థాపించారు. అమెరికాలోని డల్లాస్‌లో పెమ్మసాని ఫౌండేషన్‌ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు. తొలి నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్‌ ఎన్నారై విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు.