Peddireddy followers are joining TDP in Punganur  : వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన పుంగనూరులో చాలా స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు పుంగనూరు వైసీపీ కార్యకర్తలు, నేతలు టీడీపీలో చేరిపోతున్నారు. పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన  పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్‍బాషాతోపాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు.  పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబు ఆధ్వర్యంలో వీరంతా టీడీపీ కండువాలు కప్పుకున్నారు.  మొత్తం 31 మంది సభ్యులు ఉన్న మున్సిపాలిటీలో 25 మందికి పైగా కౌన్సిలర్లు టీడీపీలో చేరికకు రంగం సిద్ధం అయినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.           

  


పుంగనూరు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాన్ని  కంచుకోటగా మార్చుకున్నారు. ప్రత్యర్థి నేత ఎవరైనా సరే దాడులకు గురవ్వాల్సిందే. 2019లో టీడీపీ తరపున పోటీ చేసిన అనీషా రెడ్డి వేధింపులను భరించలేక కన్నీరు పెట్టుకుని రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత చల్లా రామచంద్రారెడ్డి ఇంచార్జ్ గా బాధ్యతలు తీసుకుని టీడీపీ కోసం పని చేశారు. ఆయన ఎన్నో సార్లు దాడులకు గురయ్యారు. అలాగే భారత చైతన్య యువజన పార్టీ పెట్టుకున్న మరో నేత బోడె రామచంద్రయాదవ్ పైనా అనేక సార్లు దాడులు జరిగాయి. ఇక చంద్రబాబుపై అంగళ్లు వద్ద రాళ్ల దాడి జరిగిన తర్వాత పుంగనూరులోకి వచ్చే క్రమంలో ఆయనపై మరోసారి దాడి చేశారు. ఇలాంటి దాడులతో పుంగనూరులో మరొకరు అడుగు పెట్టుకుండా చూసుకునేవారన్న విమర్శలు ఉన్నాయి.                 


అయితే ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. ఆయన పుంగనూరులో అడుగు పెట్టలేకపోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన పుంగనూరు వచ్చేందుకు ప్రయత్నించారు. విషంయ తెలిసి టీడీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయనకు పుంగనూరులో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉండటంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన టూర్ ను వాయిదా వేసుకున్నారు. ఇప్పటి వరకూ ఆయన పుంగనూరులో అడుగు పెట్టలేకపోయారు. మరో వైపు ఆయనకు ముఖ్య అనుచరులుగా ఉన్న  వారు పార్టీ మారిపోతున్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠం .... టీడీపీ ఖాతాలోకి  వెళ్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.                    


తాను, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అందరిపై దాడులు చేయడం.. పుంగనూరులోకి రాకుండా చేయడంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలు అదే చేస్తున్నారు. టీడీపీ నేతలపై గత ఐదేళ్ల కాలంలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కవని.. అన్నింటికి లెక్క తీస్తామని అంటున్నారు. పెద్దిరెడ్డి కూడా వైసీపీ క్యాడర్ ను కాపాడలేని స్థితిలో  ఉండటంతో ఎక్కువ మంది పార్టీ మారిపోతున్నారు.