Lokesh Padayatra : చిత్తూరు జిల్లా పలమనేరులో లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రచార రథాన్ని పోలీసులు సీజ్ చేశారు. పలమనేరు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రచార రథంపై నుంచి టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ ప్రసగించారు. అనుమతి లేకుండా బహిరంగ సభలో ప్రసంగించారంటూ ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. తమ వాహనాన్ని ఆడుకోవడంపై టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఎందుకు వాహనాన్ని సీజ్ చేస్తున్నారంటూ పోలీసులు తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు.  పోలీసులపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అనంతరం వాహనాన్ని పోలీసులు వదిలిపెట్టారు.  


నెల్లూరు నుంచే జగన్ పతనం మొదలైంది -లోకేశ్ 


 అంతకు ముందు పలమనేరు క్లాక్ టవర్ సెంటర్ లో లోకేశ్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో యుద్ధం మొదలైందన్నారు. జగన్ పతనం నెల్లూరు నుంచి స్టార్ట్ అయిందని లోకేశ్ అన్నారు. ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర సమయంలో అందరినీ తాను ఉద్దరిస్తానంటే నమ్మేశారని, కంపెనీలు, ఉద్యోగాలు, సమాన అవకాశాలు, 45 ఏళ్లకే పెన్షన్లు వస్తాయని మురిసిపోయారన్నారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 151 సీట్లతో జగన్ కి అధికారం కట్టబెడితే 3.8 సంవత్సరాల్లో ఒక్క కంపెనీ అయినా జగన్ తెచ్చారా అని లోకేశ్ ప్రశించారు.  జాబ్ క్యాలెండర్ ఒక్కటైనా ప్రకటించారా? ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా ఇచ్చారా? అని నిలదీశారు. ఏపీలో ఉన్న కంపెనీలన్నీ జే ట్యాక్స్ కట్టలేక పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తారని మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి పేద, మధ్య తరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు.  


కల్తీ లిక్కర్ పురుగు మందు కన్నా బాగా పనిచేస్తోంది 
 
" 19 ఏళ్లుగా మాకు వస్తున్న సబ్సిడీని జగన్ రద్దు చేశారని పట్టురైతులు వాపోతున్నారు. రాయలసీమ ప్రాంతానికి కీలకమైన డ్రిప్ ఇరిగేషన్ ను అటకెక్కించారు జగన్. రాష్ట్రంలో పంట పొలాలకు వాడే మందులు పనిచేయడం లేదు. జగన్ తయారు చేసే కల్తీ లిక్కర్ పురుగు మందు కన్నా బాగా పనిచేస్తోంది. 25 ఎంపీ సీట్లిస్తే ప్రత్యేక హోదా తెస్తానని, దిల్లీ మెడలు వంచుతానని అన్నారు. నేడు దిల్లీ వెళ్లి జగన్ తన మెడలు వంచి కేసులు నుంచి బయటపడేందుకు చూస్తున్నారు. సీబీఐ వాళ్లు వస్తే జగన్ కాళ్లు వణికిపోతున్నాయి. మోదీ వస్తే కాళ్లు పట్టుకోవడానికి జగన్ ఆరాటపడుతున్నారు. రైతులు జగన్ పాలనలో అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది. కార్మికులు పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. సొంత బాబాయ్ ని గొడ్డలితో రాత్రి పూట కసిగా చంపించిని వారిని క్రిమినల్ అంటాం. తల్లీ, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేసిన వారిని ఏమంటాం.  జగన్మోహన్ రెడ్డి జిల్లాకొక క్రిమినల్ ను తయారుచేశారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి బినామీ పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్. జిల్లాలో ఏ కుంభకోణం చూసినా దాని వెనుక పెద్దిరెడ్డే ఉంటారు. పెద్దిరెడ్డికి మరో మారుపేరు వీరప్పన్... ఎర్ర చందనాన్ని పెద్దిరెడ్డి దోచేస్తున్నారు." -లోకేశ్ 


పెద్దిరెడ్డి పని అయిపోయింది 


 పలమనేరు అభివృద్ధికి అమర్నాథ్ రెడ్డి రూ.650 కోట్లు ఖర్చుపెట్టారని లోకేశ్ అన్నారు. మరో రూ.650 కోట్లతో పనులు ప్రారంభిస్తే వాటిని వైసీపీ వచ్చాక నిలుపుదల చేశారన్నారు. పలమనేరులో అమర్నాథ్ 80 రోడ్లు ప్రారంభిస్తే వెంకట్ గౌడ్ నిలిపేశారని ఆరోపించారు. ఇసుక దోచేస్తున్నారు. ఒక్కో టిప్పర్ రూ.50 వేలు నుంచి రూ.70 వేలుకు అమ్ముతున్నారని మండిపడ్డారు. కైగల్ రిజర్వాయర్ ను పూర్తిచేసేందుకు రూ.16 కోట్లు కేటాయించారని, ఆ పనులను వెంకట్ గౌడ్ నిలిపేశారన్నారు. గ్రానైట్ మైన్ ను కూడా వెంకట్ గౌడ్ దోచేశారని ఆరోపించారు. రూ.12 కోట్లు విలువగల మెటల్ మైన్ ను మింగేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సబ్సిడీపై పట్టు పురుగుల పెంపకాన్ని ప్రోత్సహిస్తామన్నారు.  ఎక్కడ ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యేకు 10శాతం కప్పం కట్టాల్సి వస్తోందని లోకేశ్ విమర్శలు చేశారు. పలమనేరు ఎమ్మెల్యే బెంగళూరులో ఉంటారని, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేశారన్నారు. ఈసారి పెద్దిరెడ్డి పని కూడా అయిపోయిందన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడినా, ట్వీట్, పోస్టు పెట్టినా కేసులు పెడుతున్నారని లోకేశ్ ఆరోపించారు. 2019కు ముందు తనపై ఒక్క కేసు లేదని, జగన్ సీఎం అయ్యాక 19 కేసులు పెట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు, హత్యాయత్నం కేసు పెట్టారన్నారు.