Liquor Shops Lottery In Andhrapradesh: ఏపీలో లాటరీ ప్రక్రియ ద్వారా మద్యం షాపులను అధికారులు సోమవారం కేటాయించారు. మొత్తం 3,396 షాపులకు 89,882 దరఖాస్తులు రాగా.. జిల్లా కలెక్టర్ల ఆధర్యంలో డ్రా తీశారు. విజేతలకు అనంతరం లైసెన్స్ ఇవ్వనున్నారు. అయితే, శ్రీకాకుళం జిల్లాలో లాటరీ సందర్భంగా గందరగోళం చోటు చేసుకుంది. అంబేడ్కర్ ఆడిటోరియంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పర్యవేక్షణలో లక్కీ డ్రా జరుగుతుండగా.. ఆమదాలవలస సర్కిల్ పరిధిలోని 42వ మద్యం షాపు విషయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ దుకాణానికి సంబంధించిన డ్రాలో 9వ నెంబర్ వస్తే దాన్ని అధికారులు పొరపాటున 6వ నెంబర్ అని మైక్‌లో బహిరంగంగా అనౌన్స్ చేశారు. దీంతో 6వ నెంబర్ దరఖాస్తుదారుడు సంబరపడ్డాడు. అయితే, అది 6ను తిప్పితే 9 అవుతుందని.. దాన్ని క్రాస్ చెక్ చేయాలని అధికారులను కోరగా.. అది 9 అని తేలింది. దీంతో మళ్లీ అధికారులు వెంటనే 9వ నెంబర్ అని ప్రకటించారు. దీంతో 6వ నెంబర్ వ్యక్తి తీవ్ర నిరాశకు గురయ్యాడు.


అధికారులతో వాగ్వాదం


ఇదే క్రమంలో అధికారులు కావాలనే నెంబర్ మార్చేశారంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. తోటి దరఖాస్తుదారులు సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం షాపుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామని.. ఇలాంటి సమయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ మండిపడ్డారు. అనంతరం అధికారులు ఆందోళనకారులకు జరిగింది వివరించి సద్దిచెప్పారు. దీంతో వారు శాంతించగా లాటరీ ప్రక్రియ యథావిధిగా సాగింది.


లక్కంటే ఆయనిదే..


అటు, రాష్ట్రవ్యాప్తంగా లక్కీడ్రా ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. లాటరీల్లో దుకాణాలు దక్కించుకున్న వారు నగదు సమీకరించుకునే పనిలో పడ్డారు. ఈ లాటరీలో కొందరి పంట పండింది. బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి ఏకంగా 5 దుకాణాలను దక్కించుకున్నారు. పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ తీయగా.. ధర్మవరం మున్సిపాలిటీ దుకాణం 1, 4.. ధర్మవరం రూరల్‌లో 12, ముదిగుబ్బ మండలంలో 19, బత్తలపల్లి మండలంలో 14వ నెంబర్ దుకాణాలు ఆయనకు వచ్చాయి. ఒకే వ్యక్తికి ఐదు దుకాణాలు రావడం నిజంగా అదృష్టమేనని అంతా చర్చించుకుంటున్నారు.


అటు, రాష్ట్రంలో బుధవారం నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. లాటరీ కేంద్రాలు జన జాతరను తలపించాయి. దరఖాస్తు ఫీజు ద్వారా రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్కువ దుకాణాలు తిరుపతి జిల్లాలో ఉంటే అతి తక్కువ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. తిరుపతి 227 దుకాణాలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అల్లూరి సీతారామారాజు జిల్లాలో 40 మాత్రమే దుకాణాలు ఉన్నాయి. పోటీ ఎక్కువ ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే తక్కువ అనంతపురం జిల్లాలో ఉంది. డ్రాలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఈ నెల 15న ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించనుంది. 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో అన్ని బ్రాండ్ల బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. రూ.99కే క్వార్టర్ మద్యం లభించేలా ఎమ్మార్పీలు నిర్ణయించారు.


Also Read: AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?