తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కొత్త వివాదంలో చిక్కుకుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల అమ్మకాలను జియో మార్ట్‌ కు అప్పగించినట్లుగా ఆలస్యంగా బయటకు వచ్చింది. అది కూడా భక్తులు టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించడం .. జియో మార్ట్ వెబ్ సైట్ సహకరించకపోవడంతో భక్తులు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో అసలు శ్రీవారి టిక్కెట్లకు , జియో మార్ట్‌కు సంబంధం ఏమిటన్న అంశం తెరపైకి వచ్చింది.


Also Read : బీసీ సంక్షేమం కిందకు బ్రాహ్మణ కార్పొరేషన్ ! ప్రభుత్వం చెబుతున్న కారణాలేంటి ? విమర్శలు ఎందుకు వస్తున్నాయి ?


 తిరుమల తిరుపతి దేవస్థానం సొంతంగా https://tirupatibalaji.ap.gov.in/  వెబ్ సైట్‌ను నిర్వహిస్తోంది. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు, గదుల కేటాయింపు వంటి సేవలను అందిస్తోంది. ఒక్క సారి భక్తుడు రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయితే.. తర్వాత ఎప్పుడైనా అదే అకౌంట్ ద్వారా లాగిన్ అయి దర్శనం టిక్కెట్లు, గదులు బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ శనివారం నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచినట్లుగా ప్రకటించిన టీటీడీ ఈ సారి వెబ్ సైట్‌ను మాత్రం మార్చేసింది. భక్తులు టిక్కెట్ల బుకింగ్‌ కోసం https://tirupatibalaji.ap.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే టిక్కెట్ల కోసం ఫలానా చోట క్లిక్ చేయమనే సందేశం కనిపిస్తోంది. అక్కడ క్లిక్ చేస్తే నేరుగా జియో మార్ట్ వెబ్‌సైట్‌ https://tirupatibalaji.jiomart.com/login?flow=sed ఓపెన్ అవుతోంది. అంటే  టీటీడీ వెబ్‌సైట్ ద్వారా సేవలు నిలిపి వేసి.. జియో మార్ట్‌కు అప్పగించారన్నమాట.


Also Read : ఢిల్లీ టూర్‌కు జగన్ కూడా !? మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొనే అవకాశం !


ఆ వెబ్‌బైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకునే భక్తులకు చుక్కలు కనిపించాయి. ఓటీపీ రాదు .. ఓటీపీ వస్తే లాగిన్ అవదు. ఇలా అనేక సమస్యలు ఎదురయ్యాయి. ప్రత్యేక ప్రవేశదర్శనం టిక్కెట్లను మాత్రమే కాదు సర్వదర్శనం టిక్కెట్లను కూడా ఆన్‌లైన్‌లో ఉంచుతామని టీటీడీ ప్రకటించింది. ఆ టిక్కెట్లు కూడా జియో మార్ట్‌కే అప్పగించి ఉంటారని భావిస్తున్నారు.


Also Read : హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఉద్యోగులకు షాక్.. ఉచిత వసతి రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు


గతంలో టీటీడీ వెబ్‌సైట్‌లో ఆన్ సేవల వ్యవస్థను సాఫ్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్ నిర్వహిస్తూ ఉండేది. ఆ వ్యవస్థలో భక్తులు ఇబ్బంది పడిన సందర్భాలు తక్కువే. అయితే టీటీడీ టీసీఎస్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకుని జియో మార్ట్‌కు అప్పగించారు. జియో మార్ట్ రిలయన్స్  గ్రూప్‌నకు చెందినది. నిత్యావసర వస్తువులు బుక్ చేసుకునే యాప్. ఇప్పుడు ఈ యాప్‌కే టిక్కెట్ల బుకింగ్ బాధ్యతలు ఇచ్చారు.  ఇప్పుడు జియో మార్ట్‌ తో సమస్యలు ప్రారంభమయ్యాయి.  అసలు టీసీఎస్‌ను కాదని ఓ జియో మార్ట్ యాప్‌కు ఎందుకు చాన్సిచ్చారన్నదే పెద్ద పజిల్‌గా మారింది. టీటీడీ నిర్ణయం తీవ్ర విమర్శలకు గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది.


Also Read : శ్రీవారి దర్శనం కోసం అలా వెళ్తే మోసపోవడమే! ఇలా చేస్తే చాలా సేఫ్


టీటీడీ వ్యవహారాల్లో ఇప్పటికే ప్రభుత్వం..  టీటీడీ పాలక మండలి తీరు చాలా వివాదాస్పదం అవుతోంది. టీటీడీ బోర్డులోకి నియమించిన ప్రత్యేక సలహాదారుల జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇప్పుడు భక్తుల టిక్కెట్ల అంశాన్నీ క్లిష్టతరం చేయడంతో భక్తుల ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.