టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో వందల కోట్ల విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని వైసీపీ నేతలు లేపేస్తున్నారన్న ఆయన, సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పర్యవేక్షణలో పీఓటీ యాక్ట్ దుర్వినియోగం అవుతోందన్నారు. క్వార్ట్జ్ దోపిడీలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు వైసీపీ నేతలతో కలిసి పర్యటించేందుకు తాము సిద్ధమని, వైసీపీ నేతలు డేట్ ఫిక్స్ చేయాలని సోమిరెడ్డి సవాల్ విసిరారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాలో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కొనసాగుతున్న అక్రమాలు, దోపిడీలు కాకుండా మరో రెండు భారీ స్కాంలకు వైసీపీ నేతలు తెరలేపారన్నారు.


ఎన్నికలు వచ్చే లోపు వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.  క్వార్ట్స్ ఖనిజానికి చైనాతో పాటు ఇతర దేశాల్లో అనూహ్యమైన డిమాండ్ పెరిగిందని, సాధారణంగా టన్ను రూ.3 వేలు నుంచి రూ.4 వేలు లోపు పలికే క్వార్ట్జ్ ఇప్పుడు రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పలుకుతోందన్నారు. జిల్లాలోని సైదాపురం, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో లభించే క్వార్ట్జ్ ఖనిజంపై వైసీపీ పెద్దల కన్ను పడిందన్నారు. మైనింగ్ చట్టాలు సీఎం జగన్ రెడ్డి కాళ్ల కింద పడి నలిగిపోతున్నాయన్న సోమిరెడ్డి, వైసీపీ నేతల దోపిడీలో కొందరు అధికారులు కూడా భాగస్వాములైపోయారని ఆరోపించారు. 


దొంగలంతా ఏకమయ్యారు
మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, వెంకటగిరి ఇన్ చార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఓ బృందంగా ఏర్పడి, జిల్లాలోని క్వార్ట్జ్ ను దోచేస్తున్నారని సోమిరెడ్డి తెలిపారు. రాజకీయంగా వారి మధ్య సఖ్యత సంగతి పక్కన పెడితే క్వార్ట్జ్ దోపిడీలో మాత్రం అంతా కలిసిపోయారని అన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు అక్రమంగా క్వార్ట్జ్ మైనింగ్ చేస్తున్నారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడటం హాస్యాస్పదం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో క్యాస్ట్, ఇన్ కం సర్టిఫికెట్లు తీసుకోవడమే తెలుగుదేశం పార్టీ వారికి కష్టమైపోతోందని, అలాంటిది అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సైదాపురం మండలంలో 26 క్వార్ట్జ్ గనుల లీజు గడువు ముగిసిందని, ఒక్క తుమ్మల తలుపూరు పంచాయతీలోనే రూ.400 కోట్ల విలువైన స్టాకును వైసీపీ నేతలు అక్రమంగా ఎత్తేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు.  పెరుమాళ్లపాడులో మరో 200 ఎకరాల మేత పొరంబోకు భూమితో పాటు అటవీ భూముల్లోనూ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని తెలిపారు. 


వేల కోట్లను దోచేందుకు ప్లాన్
200 మిషన్లతో తవ్వకాలకు పాల్పడుతున్నారంటే, ఎన్ని వేల కోట్లను దోచేసేందుకు స్కెచ్ వేశారో దీన్ని బట్టి ఆర్థం అవుతోందన్నారు. అటవీ భూములను సైతం వదిలిపెట్టకుండా క్వార్ట్జ్ ఖనిజం కోసం తవ్వేస్తున్నారన్న సోమిరెడ్డి, 100కి పైగా అక్రమంగా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి వేల టన్నుల క్వార్ట్జ్ ను సరిహద్దులు దాటించేస్తున్నారని అన్నారు. ఇంత బరితెగించి దోచుకుంటూ టీడీపీ వారిపై నిందలు వేయడం సరికాదన్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలందరూ కలిసి ఇంత బహిరంగంగా పకృతి సంపదను దోచేస్తుంటే మైనింగ్ శాఖ ఏం చేస్తోందని సోమిరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ రెడ్డి ఆశీస్సులతోనే ఈ దోపిడీ జరుగుతున్నట్లు అర్థమవుతోందని, నాలుగైదు జిల్లాల ఎన్నికల ఖర్చు కోసం క్వార్ట్జ్ దోపిడీ సంపాదనను వినియోగించే ప్లాన్ లో ఉన్నారని ఆరోపించారు. 


సవాల్ కు సిద్దమా ?
ఎన్ని గనులకు లీజులున్నాయో, మైనింగ్ చట్టప్రకారం ఎన్ని గనుల్లో మైనింగ్ చేస్తున్నారో, ఎన్ని స్టాక్ పాయింట్లు నిబంధనల ప్రకారం ఉన్నాయో తేలుద్దామంటూ సోమిరెడ్డి సవాల్ విసిరారు. పోలీసులు, మైనింగ్, అటవీ, రెవెన్యూ శాఖల యంత్రాంగంతో పాటు కలెక్టర్, ఎస్పీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టిందే వైసీపీ నేతలు దోచుకోవడానికి అనే విధంగా పరిస్థితులు తయారయ్యాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని తేలిపోయిందని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో వందల కోట్లు దోచేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు.