ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరైన విద్యార్థి గుండె పోటుతో ఎగ్జామ్ సెంట‌ర్‌లోనే కుప్పకూలిపోయాడు. గూడూరు పట్టణంలోని DRW కాలేజ్ కి పరీక్ష రాసేందుకు వచ్చిన సతీష్ అనే విద్యార్థి పరీక్ష హాల్ లోకి వెళ్లేముందే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో అక్కడికక్కడే పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. 


సైదాపురానికి చెందిన సతీష్ గూడూరులోని స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాడు. అతనికి గూడూరులోని DRW కాలేజీ ఎగ్జామ్ సెంటర్ గా ఉండటంతో పరీక్షలు రాస్తున్నాడు. ఈ రోజు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రం వద్దకు వచ్చినప్పుడు ఉన్నట్టుండి సతీష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే పడిపోయాడు. అతడిని వెంటనే కాలేజీ సిబ్బంది ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, మార్గమధ్యలోనే సతీష్ చనిపోయాడు.