నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో జరిగిన హత్య, ఆత్మహత్య సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. జిల్లాలో ఒక్కసారిగా తుపాకీ కాల్చిన ఘటన వెలుగు చూడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఎస్పీ విజయరావు ప్రత్యేక టీమ్ ని తాటిపర్తికి పంపించారు. హంతకుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో  సంబంధించి జిల్లా ఎస్పీ విజయరావు వివరాలు వెల్లడించారు. సురేష్ రెడ్డిది వన్ సైడ్ లవ్ అని చెప్పారు. 


సురేష్ రెడ్డి, కావ్య ఇద్దరిదీ తాటిపర్తి గ్రామం. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ గా పనిచేసేవారు. ఏడాదిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.  కావ్యను ఇష్టపడ్డ సురేష్ పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఇంట్లో వారితో మాట్లాడించాడు. కానీ కావ్య, కావ్య తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకుని చివరకు ఇలా చేశాడని ఎస్పీ విజయరావు తెలిపారు. 


ఫస్ట్ రౌండ్ తప్పించుకుంది కానీ..?
కావ్య రెడ్డిని అటాక్ చేసేందుకు సురేష్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆమె తన సోదరితో కలసి ఇంట్లోనే ఉంది. ఆమె సోదరిని బెదిరించాడు. ఆ తర్వాత కావ్యని టార్గెట్ చేసి తుపాకీ కాల్చాడు. కానీ కావ్య లక్కీగా ఆ బుల్లెట్ నుంచి తప్పించుకుంది. ఆ బుల్లెట్ నేరుగా ఇంట్లోని మంచానికి తగిలింది. రెండో రౌండ్ లో బుల్లెట్ ఆమె తలకి తగిలి చనిపోయింది. బుల్లెట్ తగిలిన తర్వాత కావ్య కుప్పకూలిపోయింది. ఆ వెంటనే సురేష్ రెడ్డి బయటకు వెళ్లిపోయాడు. తనని తాను కాల్చుకుని చనిపోయాడు. కావ్యని బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఆనె చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ సంఘటనతో ఆ ఊరు ఊరంతా షాక్‌కి గురైంది.  


గన్ ఎక్కడిదంటే..?
సురేష్ రెడ్డి వాడిన గన్ పై మేడిన్ యూఎస్ఏ అని సారి ఉందని చెబుతున్నారు ఎస్పీ విజయరావు. ఆ గన్ అతనికి ఎక్కడినుంచి వచ్చింది, ఎలా తీసుకొచ్చాడు అనే దానిపై విచారణ ముమ్మరం చేశారు. సురేష్‌కు చెందిన రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విశ్లేషించగలిగితే మరిన్ని విషయాలు బయటపడే ఛాన్స్ ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆ దిశగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు.  


ఫొటోలు ప్రచురించొద్దు.. 
కావ్య ఫొటోలు కానీ, ఆమె కుటుంబ సభ్యుల ఫొటోలు కానీ మీడియాలో ప్రచురించవద్దని కోరారు జిల్లా ఎస్పీ విజయరావు. ఇప్పటికే ఆ కుటుంబం కుంగిపోయి ఉందని, వారిని మరింత బాధ పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు.