అనుకున్నంతా అయింది, ఆనంకి వైసీపీనుంచి పొమ్మనలేక పొగపెడుతున్నట్టు తేటతెల్లమైంది. ఆనం ఘాటు వ్యాఖ్యల తర్వాత తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడి హోదాలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆయనకు అంతకంటే ఘాటుగా బదులిచ్చారు. వయసుకి తగ్గట్టు ఆనం ప్రవర్తించడంలేదన్నారు. ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గానికి పారిపోయేందుకు సిద్ధమయ్యారని, అందుకే ఆనం వివేకా జయంతి కార్యక్రమాలను ఈ ఏడాది అకస్మాత్తుగా ఘనంగా జరిపారని చెప్పారు. అన్నయ్యమీద అంత ప్రేమ ఆయనకు ఎందుకు పుట్టుకొచ్చిందో అందరికీ తెలుసన్నారు.


మానాన్న పేరు చెబితేనే ఆనంకి వణుకు..


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిని అని ఆనం రామనారాయణ రెడ్డి గొప్పగా చెప్పుకుంటారని, కానీ తన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేశారని, కానీ తానెక్కడా ఆయన గొప్ప చెప్పుకోనని అన్నారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 1096 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగితే, అసలు అభివృద్ధి జరగలేదు అని ఆనం మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు రామ్ కుమార్ రెడ్డి.


వెంకటగిరి మున్సిపాలిటీలో వైసీపీ 25 వార్డులను గెలుచుకున్నా కూడా గ్రూప్ తగాదాలు ఉన్నాయంటే అక్కడ విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో, దాని వెనక ఎవరున్నారో అందరికీ తెలుసని చెప్పారు రామ్ కుమార్ రెడ్డి.


ఎస్ ఎస్ కెనాల్ పనులకు సంబంధించి మోపూరు లో మట్టి పనుల్ని ఆపింది ఎవరో అందరికి తెలుసని విమర్శించారు. ఆ పనులన్నిటికీ ఆనం అడ్డుపడుతున్నారని చెప్పారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఎస్ఎస్ కెనాల్ పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి కారణం కూడా ఆనమేనని అన్నారు.


నేను పారిపోయానా..


2014 ఎన్నికల్లో తాన పారిపోయానంటూ ఆనం చెప్పుకుంటున్నారని, ఆ ఎన్నికల్లో తనకు 5వేల ఓట్లు వచ్చాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రిగా, ఆత్మకూరులో రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆనంకి  2014 ఎన్నికల్లో కేవలం 8 వేల ఓట్లు వచ్చాయని అన్నారు. ఎవరు గొప్పో ఆనం తెలుసుకోవాలని సూచించారు.


గెలుపుకోసం నా దగ్గరకు రాలేదా..


2019 ఎన్నికల్లో నీ గెలుపు కోసం నా ఇంటికి వచ్చిన విషయం మరిచిపోయావా రామనారాయణ రెడ్డీ అన ప్రశ్నించారు రామ్ కుమార్ రెడ్డి. సీఎం జగన్ ఆదేశాలను శిరోధార్యంగా భావించి ఆనం గెలుపుకోసం తాను కృషి చేశానని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో గడప గడపకు తిరుగుతున్న ఆనం, ఏం చేస్తున్నారనే రిపోర్ట్ మొత్తం తన దగ్గర ఉందన్నారు రామ్ కుమార్ రెడ్డి. సీటు కోసం, గెలుపు కోసం వెంపర్లాడిన ఆయన ఇప్పుడిలా తనపై విమర్శలు చేయడం సరికాదన నారు. ప్రజల ముందు మాట్లాడేపుడు వయసు కి తగ్గట్టు వ్యవహరించాలని సూచించారు. వెంకటగిరికి, నేదురుమల్లి కుటుంబానికి 40 ఏళ్లుగా విడదీయరాని బంధం ఉందని, వెంకటగిరి ప్రజలకు జీవితాంతం నేదురుమల్లి కుటుంబం రుణపడి ఉంటుందన్నారు.


తిరుతి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తాను జిల్లా మీటింగ్ పెట్టానని, ఆహ్వానం ఆనంకి కూడా అందే ఉంటుందని, అక్కడికి వస్తే అసలు వెంకటగిరి ఎమ్మెల్యే ఎవరో చెబుతానని అన్నారు. ఏడాదిపాటు నేనే ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారని, దాన్ని ఎవరూ కాదనబోరని చెప్పారు.