అయ్యప్ప దీక్ష రాద్దాంతంపై మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. హిందూ ముస్లింలను వేరు చేస్తూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కావని ఆయన మండిపడ్డారు. హిందూ మతం ఆచారాలు తెలిసి కూడా బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. అయ్యప్ప మాల ధారణతో నమాజ్ టోపీ ధరించకూడదు అని ఎక్కడైనా శాస్త్రంలో ఉంటే చూపించండి అని ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది అయ్యప్ప దీక్ష లోనే ఉందని, తాను చేసింది తప్పో ఒప్పో నెల్లూరు ప్రజలకు బాగా తెలుసని అన్నారు అనిల్. సోము వీర్రాజు లాంటి సీనియర్ నేతలు కూడా చిల్లర వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. వారి వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు అనిల్.


నెల్లూరు దర్గాకు వచ్చేది హిందువులు కాదా..?


నెల్లూరు బారా షాహిద్ దర్గా, కసుమూరు హజ్రత్ దర్గాలను హిందువులే అత్యధికంగా వెళ్తుంటారని, నెల్లూరులో పరమత సహనం ఉందన్నారు. అలాంటి నెల్లూరులో చిచ్చుపెట్టాలని చూడటం సరికాదన్నారు. నెల్లూరులో ఉన్న సున్నిత వాతావరణాన్ని చెడగొట్టద్దని హితవు పలికారు.


వావర్ స్వామి ఎవరు..?


అయ్యప్ప మాల ధరించి మొక్కు చెల్లించుకోడానికి శబరిమలకు వెళ్లే ప్రతి అయ్యప్ప భక్తుడు ముందుగా వావర్ స్వామిని దర్శిస్తాడని తెలిపారు అనిల్. అయ్యప్ప మాలధారణ చేసిన వ్యక్తులు దర్శించే వావర్ స్వామి ముస్లిం కాదా అని ప్రశ్నించారు. వావర్ స్వామి మసీదుని దర్శిస్తే మత ఆచారాలను పాటించనట్టేనా అన ప్రశ్నించారు అనిల్.


అయ్యప్ప మాల ధారణలో ఉన్న అనిల్, ఇటీవల ముస్లిం నాయకులతో కలసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన ముస్లింల సంప్రదాయ టోపీ ధరించారు. దీన్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు. అయ్యప్ప మాలలో ఉన్న అనిల్ ముస్లింలు ధరించే టోపీ ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఆయన వెంటనే అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత బీజేపీ నేతలు కొంతమంది అనిల్ ఇంటిముందు ధర్నా చేపట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


బీజేపీ నేతలు తన ఇంటిని చుట్టుముట్టినప్పుడు అనిల్, విజయవాడ పర్యటనలో ఉన్నారు. తాజాగా ఆయన విజయవాడనుంచి తిరిగొచ్చి గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చారు. అయ్యప్ప మాల ధరించిన వారు ముస్లింల టోపీ పెట్టుకోవడం తప్పని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదని, పరమత సహనం హిందూధర్మం సూచిస్తోందని, దాన్ని బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.


నెల్లూరు నగరంలోని 40వ డివిజన్ మూలాపేటలోని కొండదిబ్బ, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మునిసిపల్ క్వార్టర్స్, తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే అనిల్ గడప గడపకు మన ప్రభుత్వం 66వ రోజు పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి  వివరించారు. హిందూ ముస్లింలను వేరు చేస్తూ కొన్ని మీడియా ఛానళ్ళు, బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. స్థానిక డివిజన్ లో 200మంది యువకులు వైసీపీలో చేరగా వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.