Kavali MLA :    అయ్యా మేం సత్యవంతులం కాదు, మా హయాంలో కూడా తప్పులు జరుగుతున్నాయంటూ క్లారిటీ ఇచ్చారు కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. గ్రావెల్ మాఫియా అంటూ ఇటీవల స్థానిక పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయన మండిపడ్డారు. మా హయాంలోనే తప్పులు జరుగుతున్నా, గత టీడీపీ హయాంలో ఇంతకంటే పెద్ద తప్పులు జరిగాయి కదా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ టైమ్ లో కూడా చిన్న చిన్న అవకతవకలు కామన్ అని అన్నారు. టీడీపీ నేతలే గ్రావెల్ మాఫియాగా ఏర్పడ్డారని చెప్పారు ఎమ్మెల్యే. ప్రస్తుతం కావలి ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. 


కావలిలో గ్రావెల్ మాఫియా విమర్శలు  - ఎమ్మెల్యేపైనే ప్రధాన ఆరోపణలు


కావలి నియోజకవర్గంలో భారీగా గ్రావెల్ కుంభకోణం జరుగుతోందని టీడీపీ నేతలు ఇటీవల ఆరోపణలు చేశారు. స్థానిక మీడియాలో కూడా దీనిపై కథనాలు వచ్చాయి. ఎమ్మెల్యే సహా ఆయన ప్రధాన అనుచరుడు ఈ కుంభకోణంలో భాగస్వామిగా ఉన్నారంటూ వార్తలిచ్చారు. దీనిపై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పందించారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. ఆ కథనాలను చూసి తాను కూడా మెచ్చుకున్నానని, హెడ్డింగ్ బాగుందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గ్రావెల్ కుంభకోణం విషయానికొస్తే అది టీడీపీ హయాంలోనే మొదలైందన్నారు. ఇప్పుడు కూడా అవసరాలకు అనుగుణంగా చిన్నచిన్న అవకతవకలు జరుగుతున్నాయన్నారు. తమ అవసరాల కోసం కొందరు అనధికారకంగా గ్రావెల్ ను తవ్వుకుంటున్నారని వివరణ ఇచ్చారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. 


తమ అవసరాల కోసం కొంత మంది అనుమతుల్లేకుండా తవ్వుకుంటున్నారన్న ఎమ్మెల్యే 


రాష్ట్రంలో రోడ్లు వేయాలన్నా, జగనన్న లే అవుట్లలో పునాదులకోసం గ్రావెల్ అవసరం అన్నారు. అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి కాబట్టే గ్రావెల్ పెద్ద ఎత్తున అవసరం అయిందని, అందుకే కొందరు అక్రమంగా తవ్వుకుని ఉంటారని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే. దీనికే టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వారి హయాంలో జరిగిన అవినీతి గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.  టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, నియోజకవర్గ ఇన్ చార్జ్ కలసి గ్రావెల్ మాఫియాకి పునాదులు వేశారని మండిపడ్డారు కావలి ఎమ్మెల్యే. వారి హయాంలోనే అది మొదలైందని, తమ హయాంలో ఆ స్థాయిలో కాకపోయినా కాస్తో కూస్తో అక్రమాలు జరుగుతున్నాయని ఒప్పుకున్నారు. 


ప్రభుత్వ పెద్దల వరకూ వెళ్లిన ఎమ్మెల్యే కామెంట్స్ - వివరణ ఇప్పించే చాన్స్ 


కావలి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్నాయి. అసలు ఎమ్మెల్యే అలా ఎందుకు మాట్లాడారని ఆరా తీస్తున్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేదని ఓవైపు సీఎం జగన్ చెబుతుంటే, మరోవైపు ఎమ్మెల్యేలే స్వయంగా ఇలా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పుకోవడం సరికాదంటున్నారు మరికొంతమంది నేతలు. ఎమ్మెల్యే నోరు జారి చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎమ్మెల్యేతోనే ప్రెస్ మీట్ పెట్టించి వివరణ ఇప్పిస్తారా లేక, సైలెంట్ గా క్లాస్ తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి కావలి ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.