నెల్లూరు జిల్లా సంగంలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ని సీఎం జగన్ ప్రారంభించారు. బ్యారేజ్ ప్రారంభోత్సవ సందర్భంగా శిలా ఫలకం ఆవిష్కరించిన జగన్, అనంతరం పెన్నాకు హారతులిచ్చారు. సీఎం జగన్ వెంట జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా సంగం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కి చేరుకున్న జగన్ సంగం బ్యారేజ్ వద్దకు బస్సులో వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన నాయకులను సీఎం జగన్ కు పరిచయం చేశారు. అక్కడినుంచి నేరుగా బ్యారేజ్ ఆవిష్కర సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ప్రారంభించారు సీఎం జగన్. అనంతరం పెన్నా నదికి ఆయన హారతి ఇచ్చారు. బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ సమయంలో గౌతమ్ రెడ్డి సతీమణి, కుమార్తె.. ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. 


సంగంకు వచ్చిన సీఎం జగన్ కు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర జలవనరు శాఖమంత్రి అంబటి రాంబాబు కూడా జగన్ వెంట ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. లోక్ సభ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, నెల్లూరు జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు పోతుల సునీత, తూమాటి మాధవ రావు, ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి , మానుగుంట మహీధర్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, కిలివేటి సంజీవయ్య,  వరప్రసాద రావు, ఆనం రామనారాయణరెడ్డి.. జగన్ కు స్వాగతం పలికారు. 


సంగం బ్యారేజ్ కి 2008లో నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేయగా, నేడు ఆయన తనయుడు జగన్ హయాంలో ప్రాజెక్ట్ పూర్తయింది. పెన్నా డెల్టా, కనుపూరు కాలువ, కావలి కాలువల కింద సుమారు 3,85,000 ఎకరాల ఆయకట్టు ఈ బ్యారేజ్ వల్ల సాగులోకి వస్తుంది. రూ. 335.80 కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజ్ నిర్మించారు. ఈ బ్యారేజ్ నిర్మాణం వల్ల పొదలకూరు సంగం మండలాల మధ్య గల రాకపోకల సమస్యలు పరిష్కారం అవుతుంది. బ్యారేజ్ లో 0.45 టీఎంసీల నీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల భూగర్భజల మట్టం పెరిగి చుట్టుప్రక్కల గ్రామాలలోని త్రాగు నీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. తీవ్ర వరద పరిస్థితులలో ఈ బ్యారేజీ వరద నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. సంగం బ్యారేజ్ పర్యాటకంగా కూడా ఆకర్షణీయమైన ప్రాజెక్ట్ గా మారుతుంది. ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తి కాకమునుపే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందడంతో.. ఆయన పేరుని ఈ బ్యారేజ్ కి పెట్టారు.