Rains in Telangana AP: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణలో సోమవారం కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా, ఏపీలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసిందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణం వైపు నుంచి గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి కొమొరిన్ ప్రాంతం, మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక లోపల 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. 
తెలంగాణలో వర్షాలు 
తెలంగాణ రాష్ట్రంలో మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నిన్న కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగరి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి.  మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. 






నేడు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు మరో 3 రోజుల వరకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్ నగరంలో ఉదయం మేఘాలతో ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు వీచనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడటంతో ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు తేలికపాటి జల్లులు కురిశాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల వర్షాలు లేక, పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అన్నదాతలు వర్షాల కోసం చూస్తున్నారు.   
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి రెండు రోజులపాటు తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో మాత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ కేంద్రం. కృష్ణా, గుంటూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, ఎన్.టీ.ఆర్, పల్నాడు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. దక్షిణ కోస్తాంధ్రలో తీరంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. రాయలసీమలో నంద్యాల, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలోని పలు భాగాల్లో భారీ వర్షాలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.