"వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారని తేలింది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన వారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నాం. ఆ నలుగురు ఎమ్మెల్యేలు 10నుంచి 15కోట్ల రూపాయలు టీడీపీ దగ్గర తీసుకున్నట్టు తెలిసింది, టీడీపీ టికెట్ పై కూడా వారికి హామీ లభించినట్టుంది." ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల సారాంశం ఇది. కానీ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్న వారి పేర్లు చెప్పలేదని లాజిక్ తీస్తున్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. తమ ఎమ్మెల్యేలు అమ్ముడయ్యామని అంటున్నామే కానీ, వారి పేర్లు చెప్పలేదు కదా అని ఆయన ప్రశ్నించారు. డబ్బులు తీసుకున్నోళ్లే భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. 


ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పు చేయడం వల్లే పార్టీ వారిని సస్పెండ్ చేసిందన్నారు కాకాణి. జిల్లాలో ఆ ఎమ్మెల్యేలంతా జగన్ వల్లే గెలిచారన్నారు. జగన్ చెప్పిన వారికి ఓటు వేయకుండా ఆ ముగ్గురు పార్టీకి ద్రోహం చేశారని, అది క్షమించరాని నేరం అని చెప్పుకొచ్చారు కాకాణి. ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి తో చర్చించాలే కానీ ఇలా విమర్శలు చేయడం సరికాదన్నారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు కాకాణి. పట్టభద్రుల ఎన్నికలు ఎదుర్కోవడం వైసీపీకి మొదటి సారి అని, ఆ ఎన్నికల ప్రక్రియ కొంత క్లిష్టంగా ఉంటుందని, అందులో తాము కొంత వెనకపడ్డామని అన్నారు కాకాణి. ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాల్సిన ఎన్నికలు అవి అన్నారు. టీడీపీ కూడా రెండో ప్రాధాన్యత ఓటుతో గట్టెక్కిందని గుర్తు చేశారు కాకాణి. 


ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఎవరు ఓటు వేశారో అందరికీ తెలుసన్నారు కాకాణి. వారి వైఖరే ఆ విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. వారు మరుసటి రోజు అసెంబ్లీకి రాకుండా మొహం చాటేశారని చెప్పారు. ఎవరు పార్టీని వీడినా ఇబ్బంది లేదని, పార్టీ పటిష్టంగా ఉందని, కొత్త నేతలు చాలా మంది ఉన్నారని చెప్పారు కాకాణి. 


సస్పెండ్ అయిన ఆ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశామనే విషయంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు మంత్రి కాకాణి. పార్టీ కేడర్ మొత్తం తమవైపే ఉందన్న ఆయన.. నెల్లూరు జిల్లాలో పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తామన్నారు. ఇష్టం వచ్చినట్టు పార్టీ నిర్ణయాన్ని కాదని ఓటు వేస్తే కుదరదని చెప్పారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తూ ప్రజల్లో మరింత బలహీన పడుతున్నారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారిని సస్పెండ్ చేసిన వెంటనే ప్రజలు సంబరాలు చేసుకున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్నారు. 2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.


పచ్చ మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాకాణి. వయసు పైబడిన ఓ మీడియా అధినేతకు మతిభ్రమించిందని ధ్వజమెత్తారు. వారి తప్పుడు రాతలను రైతులు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.


ఎమ్మెల్యేల సస్పెన్షన్ తో నెల్లూరు రాజకీయం మరింత రంజుగా మారింది. సస్పెండ్ అయినవారిలో ముగ్గురు నెల్లూరు జిల్లాకు చెందినవారే కావడంతో ఆయా స్థానాల్లో ప్రత్యామ్నాయం కోసం అధిష్టానం సీరియస్ గా ఆలోచిస్తోంది. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ చేజారకుండా జాగ్రత్తపడుతున్నారు.