Anam On Jagan Governament :   ఏపీలో తమకింకా ఏడాదిన్నరకు పైగా అధికారం ఉందని, ముందస్తు ఎన్నికల ఊహాగానాలు నిజమైతే ముందే ఇంటికెళ్లిపోవడం ఖాయమని కుండబద్దలు కొట్టారు మాజీ మంత్రి , వెంకటగిరి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఇటీవల వరుసగా ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న ఆయన, తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. ముందస్తు ఎన్నికలొస్తే ముందే ఇంటికెళ్లిపోతామన్నారు.


ఆనంకు క్లారిటీ వచ్చేసిందా..?


ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తరపున గడప గడప కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఆయనకు వచ్చే దఫా టికెట్ రాదని క్లారిటీ వచ్చేసినట్టుందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.  అందులోనూ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నేరుగా ఆయనపై నిప్పులు చెరిగారు. అధిష్టానం ఆశీర్వాదం ఉండకపోతే ఆయన అంతగా ధైర్యం చేయరు. మరో వైపు ఆయన మంత్రి కాకాణితో కూడా ఆయన టచ్ లోనే ఉన్నారు. అంటే వచ్చే దఫా వెంకటగిరి టికెట్ రామ్ కుమార్ రెడ్డికే ఖాయమైందనే వార్తలు కూడా జోరందుకున్నాయి. దీంతో రామనారాయణ రెడ్డి ఇంకాస్త  దూకుడు పెంచారన్న వాదన వినిపిస్తోంది. 


నర్మగర్భ వ్యాఖ్యలు..!


పరోక్షంగా ప్రభుత్వం పరువు తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు ఆనం రామనారాయణ రెడ్డి. ముందస్తు ఎన్నికలొస్తే ఇంటికెళ్లడం ఖాయమంటున్న ఆయన, ప్రజలు తమకు ఇచ్చిన పదవీకాలం పూర్తి కావొచ్చిందని, అయితే ఇంకా ప్రజలకిచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదని చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలోనే ఇంకా సచివాలయాల నిర్మాణాలు పూర్తి కాలేదని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదా,  లేక చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదా అనేది తనకు తెలియడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. 


సడన్ గా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు..!


రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఆ విషయాన్ని ఎమ్మెల్యేలు, నాయకులు గుర్తుంచుకోవాలన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు వేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వాగుల వద్ద హై లెవెల్ బ్రిడ్జిలు కట్టబోతున్నామని, త్వరలో టెండర్లు కూడా పిలుస్తామని చెప్పారు.


పదే పదే వైఎస్ఆర్ ప్రస్తావన..!


మహనీయుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నెల్లూరు ప్రాంతానికి అనేక విధాలుగా సహాయ పడ్డారని గుర్తు చేశారు ఆనం. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా... తెలుగు గంగ నీరు పక్క రాష్ట్రానికి తరలిపోతుంటే ఈ ప్రాంతానికి సాగునీరు కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు ...ఆ అడవి ప్రాంతానికి వచ్చి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఈ ప్రాంతానికి న్యాయం చేస్తాను అని మద్దతు తెలిపిన మహనీయుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. అధికారంలోకి రాగానే తెలుగుగంగ కాలువలకు ప్రాధాన్యత ఇచ్చి అందరికీ కూడా త్రాగునీటిని ఇచ్చిన  ఖ్యాతి వైఎస్ కే దక్కుతుందని చెప్పారు. ఆయన ఘనతను ఎప్పటికీ వెంకటగిరి వాసులు మరచిపోలేరన్నారు.


సోమశిల  స్వర్ణముఖి లింకు కాలువ పనులను పునః ప్రారంభించి సైదాపురం మండలంలో దాదాపుగా మరో 15వేల నుండి 20వేల ఎకరాలకు సాగునీటిని అందించే దిశగా అడుగులేస్తున్న తరుణంలో మధ్యలో ఆగిపోయిందని గుర్తు చేశారు ఆనం. ఈ ప్రభుత్వంలోనే సోమశిల స్వర్ణముఖి కాలువను పూర్తి చేయాలని ఆశిస్తున్నానన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన ఫలితాలు రైతాంగానికి రావాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు.