TDP On Kotamreddy : వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి టీడీపీ ఎంట్రీ అంత ఈజీగా కనిపించడంలేదు. చంద్రబాబు ఒప్పుకుంటే నెల్లూరు రూరల్ నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన కోటంరెడ్డికి టీడీపీలో చేరకముందే వర్గపోరు మొదలైంది. కోటంరెడ్డి లాంటి వాళ్లు టీడీపీకి అవసరంలేదని స్థానికి టీడీపీ నేతలు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి వైసీపీ నుంచి బయటకు వచ్చిన కోటంరెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. వైసీపీ అధిష్ఠానంపై తీవ్ర ఆరోపణలు చేసి పార్టీ నుంచి బయటకు వచ్చిన కోటంరెడ్డికి టీడీపీ నేతలు షాక్ ఇచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గంజాయి మొక్కలాంటి వారని, అలాంటి వ్యక్తి టీడీపీకి అవసరం లేదని నెల్లూరు టీడీపీ నేతలు పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. కోటంరెడ్డిపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామంటున్నారు.  


టీడీపీలోకి ఎవరిని పడితే వారిని రానివ్వం 


క్రికెట్ బెట్టింగులు ఆడేవారిని, సింగల్ నెంబర్లు ఆడించేవారిని టీడీపీలోకి ఆహ్వానించేది లేదన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ అబ్దుల్ అజీజ్. ఎవరైనా ఇంట్లో పండ్ల, పూల మొక్కలు నాటుకుంటారు కానీ గంజాయి మొక్కలు నాటుకోరు కదా అని ప్రశ్నించారు. టీడీపీ విలువలతో కూడిన పార్టీ అని, దానిలోకి ఎవరిని పడితే వారిని ఆహ్వానించరని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు, లోకేశ్ స్పష్టంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ నేతలు ఒకరి పాపాలు ఒకరు చెప్పుకుంటున్నారని, ప్రస్తుతం దానిని ఆస్వాదిస్తున్నామని అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరిక విషయం.. చంద్రబాబు, లోకేశ్ ల వద్ద సోదిలో కూడా లేదన్నారు. చంద్రబాబు, లోకేశ్ తో తాను సమావేశమయ్యానని ప్రస్తుతం తన పని తాను చేసుకోమని చెప్పారని అజీజ్ అన్నారు. కోటంరెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 


 అసంతృప్తిగా టీడీపీ నేతలు  


 కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపుగా టీడీపీలో చేరడం ఖాయం అయింది.  ముందుగా చంద్రబాబు, లోకేశ్ తో చర్చలు జరిపాకే వైసీపీని టార్గెట్ చేశారని ఆరోపణలు లేకపోలేదు.  అయితే చంద్రబాబు అవకాశమిస్తే టీడీపీ తరఫున పోటీ చేస్తానని చెప్పుకొస్తున్నారు కోటంరెడ్డి. టీడీపీ నుంచి కోటంరెడ్డికి ఊహించని షాక్ తగిలేలా ఉంది. టీడీపీకి చెందిన కొందరు నేతలు కోటంరెడ్డి విషయంలో అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్ ఛార్జ్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డిపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  టీడీపీ నేతలపై దాడులు చేసినవాళ్లు, టీడీపీ కార్యకర్తలను కేసులతో వేధించినవాళ్లు, బెట్టింగ్ బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని బెదిరించేవాళ్లు టీడీపీకి అవసరంలేదన్నారు. ఇటీవలే చంద్రబాబు, లోకేశ్ తో తాను మాట్లాడానని చెప్పిన అబ్దు్ల్ అజీజ్.. కోటంరెడ్డి వ్యవహారం వాళ్ల దృష్టిలో లేదన్నారు.  


టీడీపీ నేతల్లో టెన్షన్ 


నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి రెబల్ జెండా ఎగురవేశారు. ఇప్పుడు ఆ ఇద్దరూ టీడీపీకి దగ్గరవుతున్నారు. కోటంరెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించగా, రేపో మాపో ఆనం కూడా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు నేతలు ఎంట్రీతో స్థానిక టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే సీట్లు కన్మ్ఫామ్ అనుకున్న నేతలు అసంతృప్తిలో ఉన్నారు. ఇన్నాళ్లు పార్టీకోసం పనిచేసిన తమకు అన్యాయం చేస్తారేమో అనే ఆందోళన టీడీపీ నేతల్లో మొదలైంది. దీంతో ఒక్కొక్కరిగా అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నారు.  తాజాగా నెల్లూరు రూరల్ టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ కోటంరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్రకలకలం రేపుతున్నాయి.