దింపుడు కళ్లెం ఆశతో శవానికి దహన సంస్కారాలు చేసేముందు, మూడుసార్లు పేరు పెట్టి పిలవడం హిందూ సంప్రదాయం. చనిపోయినవారు బతికొస్తారని కాదు కానీ, అది ఆచారంగా భావిస్తుంటారు. అయితే అలాంటి ఆచారం కాస్తా ఇప్పుడు నెల్లూరులో నిజమైంది. దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత శవం లేచొచ్చింది. పూడ్చిపెట్టిన శవం మనిషి రూపంలో కళ్లముందు కనపడే సరికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భయపడిపోయారు. ఊరివారంతా హడలిపోయి పరుగులెత్తారు. ఇదేదో కల్పిత కథ కాదు, సీరియల్ లో, సినిమాల్లో జరిగింది అంతకంటే కాదు, నిజ జీవితంలో జరిగిన వాస్తవం. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లమూడిలో జరిగిన యదార్థ ఘటన.


అసలేం జరిగిందంటే..?


మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో పాలేటి వెంకయ్య, రమాదేవి దంపతులు. రమాదేవి గ్రామ సర్పంచ్. వారికి ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు పేరు సుమంత్, రెండో కొడుకు పేరు సతీష్. ఇటీవల రెండో కొడుకు సతీష్ కుటుంబ సభ్యులపై అలిగి ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. అతనికోసం కుటుంబ సభ్యులు గాలించారు. తెలిసినవారికి ఫోన్ చేశారు, స్నేహితుల్ని ఆరా తీశారు. కానీ ఫలితం లేదు. మూడు రోజులుగా జాడ తెలియలేదు. అయితే వీరు వెదికే క్రమంలో వెంకటాచలం వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో ఓ శవం కనిపించింది. ఆ శవం పోలికలు సతీష్ లానే ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు శవాన్ని తీసుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతా అయిపోయాక చిన్న కర్మ కూడా నిర్వహించారు. సతీష్ ఫొటోకి దండవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.


సీన్ కట్ చేస్తే..?


శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అక్కడ సీన్ కట్ చేస్తే.. ఆదివారం సతీష్ ఇంటికి తిరిగొచ్చాడు. పూడ్చేసిన శవం ఎలా లేచొచ్చిందంటూ తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఊరిలో సతీష్ ని చూసినవారంతా దెయ్యం అంటూ పారిపోవడం విశేషం. కుటుంబ సభ్యులు కూడా సతీష్ ని చూసి దెయ్యం అనుకున్నారు. పరుగులు తీశారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది.


సతీష్ ఎలా తిరిగొచ్చాడు..?


ఆదివారం సతీష్.. ఇంటికి తిరిగొచ్చాడు. అసలిన్ని రోజులు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడనే విషయం తానే స్వయంగా చెప్పుకొచ్చాడు. అలిగి వెళ్లిన తాను స్నేహితుల దగ్గర ఉన్నానని చెప్పాడు సతీష్. ఫోన్ కూడా స్విచాఫ్ చేసి నాలుగు రోజులుగా రూమ్ లోనే ఉండిపోయాయని అన్నాడు. తీరా ఊరిలోకి వస్తే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని తెలుసుకుని పరుగు పరుగున ఇంటికొచ్చానని చెప్పాడు. సతీష్ ని చూసి మొదట భయపడిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చనిపోయాడనుకున్న కొడుకు బతికి రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


ఆ మృతదేహం ఎవరిది..?


అయితే సతీష్ గా పొరబడి అంత్యక్రియలు చేసిన మృతదేహం ఎవరిదనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సతీష్ మృతదేహం అనుకుని తల్లిదండ్రులు కూడా భ్రమపడ్డారు, శవాన్ని పూడ్చేశారు. కానీ ఇప్పుడు సతీష్ బతికి రావడంతో పూడ్చిపెట్టిన ఆ శవం ఎవరిదనేది తేలడంలేదు. దీనిపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ శవాన్ని వెలికితీసే పనిలో పడ్డారు.