Mylavaram MLA Vasantha Krishna Prasad Visits NTR District: వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, విశాఖ, అల్లూరి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాల నేపథ్యంలో బయటకు రావొద్దని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలోని (Krishna District) వరద ప్రభావిత ప్రాంతాల్లో మైలవరం (Mylavaram) ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ (Vasantha Venkata Krishnaprasad) నడుము లోతు నీటిలో పర్యటించారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ప్రాంతంలో లోతు నీటిలోనే ఉంటూ వరద బాధితులను పరామర్శించారు. సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను సమన్వయం చేశారు.


ప్రతి ఇంటికీ ఆహారం, తాగునీరు అందించాలని సూచించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అటు, పెన్షన్లను సైతం వరద నీటిలోనే పంపిణీ చేశారు. పంపిణీకి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అటు, ఎమ్మెల్యే చర్యలపై ప్రజలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిలోనే ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షించడంపై కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 


ప్రజల తీవ్ర ఇబ్బందులు


భారీ వర్షాలతో విజయవాడ, గుంటూరు నగరాల్లోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్‌లో రహదారులు జలమయం కాగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల మోకాళ్ల లోతు నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. విజయవాడ బస్టాండ్ పరిసరాలు నీట మునిగాయి. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరి జాతీయ రహదారిపై రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసేశారు. భారీ వర్షాలకు గుంటూరు నగరంలోని గడ్డిపాడు చెరువు పొంగిపొర్లుతోంది. గడిచిన 24 గంటల్లో మచిలీపట్నం 19 సెం.మీ, విజయవాడ 18, గుడివాడ 17, కైకలూరు 15, నర్సాపురం 14, అమరావతి 13, మంగళగిరి 11, నందిగామ, భీమవరం 10, పాలకొల్లు, తెనాలిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 


Also Read: Vijayawada Rains: కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి, ఒక్కో ఫ్యామిలీకి రూ.5 లక్షల చొప్పున పరిహారం


20 రైళ్లు రద్దు


భారీ వర్షాల క్రమంలో విజయవాడ డివిజన్ పరిధిలోని పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రాబోయే 2 రోజుల పాటు దాదాపు 20 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ - తెనాలి, విజయవాడ - గూడూరు, విజయవాడ - కాకినాడ పోర్టు, తెనాలి - రేపల్లె, గుడివాడ - మచిలీపట్నం, భీమవరం - నిడదవోలు, నర్సాపూర్ - గుంటూరు, గుంటూరు - రేపల్లె, గుంటూరు - విజయవాడ, విజయవాడ - నర్సాపూర్, ఒంగోలు - విజయవాడ, విజయవాడ - మచిలీపట్నం, విజయవాడ - ఒంగోలు రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.


Also Read: Trains Cancelled: వాయుగుండంతో భారీ వర్షాలు - విజయవాడ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు, దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన