Mummdivaram Bus Stand: దశాబ్ధాల కాలంగా సేవలందించిన ఆర్టీసీ బస్టాండ్‌ అది.. వేల మంది ప్రయాణికులు అక్కడ సేదతీరిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది. అమలాపురం, కాకినాడ నుంచి రాకపోకలు సాగించే బస్సులు తప్పకుండా ఆ బస్టాండ్‌లోకి వెళ్లే పరిస్థితి ఉండేది. అయితే ఈ బస్టాండ్‌పై సుదీర్ఘకాల పన్నాగం పన్ని చివరకు బస్సులు కూడా లోనికి వెళ్లలేనంత ఆక్రమణలు చేశారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. 


కారణం ఏం తెలియదు కానీ అయిదేళ్ల క్రితం నుంచి బస్టాండ్‌లోకి బస్సుల రావడం లేదు. ఆ తరువాత ప్రయాణికులు రోడ్డుపైనే మండుటెండలో నిలబడుతున్నారు. ఎప్పుడో వచ్చే బస్‌ కోసం ఎండలో నిలబడలేని వాళ్లు ఆటోలు ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. కొన్నాళ్ల పాటు బస్టాండ్‌కు ఆనుకొని ఉండే స్థలాన్ని ఖాళీ ఉంచారు. తర్వాత ఆర్టీసీ నష్టాల్లో ఉందని స్థలం లీజుకు ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానించింది. 


ఆర్టీసీ స్థలం కోసం సాగిన టెండర్ ప్రక్రియలోనూ గోల్‌మార్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. సిండికేట్‌దారుల కనుసన్నల్లో నామమాత్రపు నెలవారీ లీజు ప్రాతిపదికన కట్టబెట్టినట్టు తెలుస్తోంది. పదిహేనేళ్లపాటు ఓ వ్యక్తికి అప్పగించారని అంటున్నారు. అలా నామమాత్రపు అద్దెతో పరిమిత కాలానికి లీజుకు తీసుకున్న వ్యక్తి ఆ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నట్టు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


లీజుకు దక్కిందిలా...
ముమ్మడివరం మెయిన్‌ రోడ్డును ఆనుకుని ఏపీఎస్‌ ఆర్టీసీకి సుమారు మూడు ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలం ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా. అయితే దాదాపు అయిదేళ్ల పాటు నిరూపయోగంగా వదిలేసుకున్న ఆర్టీసీ దానిని పూర్వస్థితికి తీసుకురావాల్సింది పోయి లీజు ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టింది. గతేడాది సెప్టెంబర్‌లో టెండర్లకు పిలిచింది. 70 శాతం భూమిని రెండు విభాగాలుగా విడదీసి ఆక్షన్‌ నిర్వహించింది. ఇందులో బిట్‌-1 గా 2162 చదరపు గజాల భూమిని రూ.79,940, బిట్‌-2 ను 1751 చదరపు గజాల భూమిని రూ.45,369 కు నెలవారీ అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు దీన్ని ముమ్మిడివరానికి చెందిన ఓ టీడీపీ నాయ‌కుడు దక్కించుకున్నాడు. ఆరునెలల అద్దె సొమ్మను రిఫండబుట్‌ సెక్యూరిటీ డిపాజిట్‌గా కట్టేశారు. దీంతో ఈ భూముల్లో తాత్కాలికంగా నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఆర్టీసీ..


టెండర్లు విషయంలో రింగ్‌ మాయాజాలం..
టెండర్లు దశలోనే పోటీదారులు లేకుండానే అంతా సిండికేట్‌గా మారి రింగ్‌ మాయాజాలం అమలుపరిచారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారని పలువురు సామాజికవేత్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అత్యంత విలువగల కమర్షియల్‌ స్థలాన్ని తక్కువకే కట్టబెట్టారంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హాయాంలో జరిగిన ఈ టెండర్లు ప్రక్రియలో పార్టీలను పక్కనపెట్టి సిండికేట్‌గా మారి ఈ విలువైన స్థలాన్ని అత్యంత తక్కువ లీజుకే దక్కించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


నిబంధనలకు పాతరేసి నిర్మాణాలు..?
ముమ్మిడివరం బస్‌స్టాండ్‌ స్థలం రెండు బిట్లుగా దక్కించుకున్న లీజుదారు అక్కడ పక్కాభవనాలు నిర్మిస్తున్నారు. కేటాయించిన స్థలాన్ని దాటి ఇంకా ఆర్టీసీ ఆదీనంలో ఉన్న భూమిలోనూ నిర్మాణాలు చేపట్టారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆర్టీసీకు సంబందించిన భూమిలో ఫ్లోర్‌ నిర్మాణం చేపట్టారు. లీజుకు కేటాయించలేని స్థలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడం ఇలా అనేక రకాలుగా ఇక్కడ అగ్రిమెంట్‌ నిబంధనలకు పాతరేస్తున్నారని, అయినా ఆర్టీసీ అధికారులు ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. 


ఇదిలా ఉంటే ఆర్టీసీ బస్‌ స్టాండ్‌ కోసం మిగిల్చుకున్న కొంత స్థలానికి వెళ్లే మార్గంలో భీమ్‌లు, పిల్లర్లు నిర్మించారు. ఇలాంటి చర్యలపై స్థానికుల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిభందనలకు విరుద్ధంగా ఈ విధమైన పరిస్థితి కనిపిస్తుండగా అసలు 40 సెంట్లు ఉన్న స్థలంలో కల్యాణ మండపం నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు.. తక్కువ స్థలం ఉండడం వల్ల ఫైర్‌ సేప్టీ, పార్కింగ్‌ తదితర ఇబ్బందులు లేకపోలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అగ్రిమెంట్‌ నిబంధనలు అతిక్రమిస్తున్న పరిస్థితికి అడ్డుకట్టవేయాలని డిమాండ్‌ చేస్తున్నారు..


రోడ్డుపైనే ప్రయాణికుల అవస్థలు...
సుదీర్ఘకాలంగా ప్రయాణికులకు సేవలందించిన ముమ్మిడివరం బస్‌స్టాండ్‌ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య ధోరణేనని పలువురు మండిపడుతున్నారు. వీరి నిర్లక్ష్యం వల్లనే నిత్యం వందల మంది ప్రయాణికులు ముమ్మిడివరం సెంటర్‌లో నడిరోడ్డు అగచాట్లు పడుతున్నారు. అసలు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ముమ్మిడివరం బస్‌స్టాండ్‌ను ఎందుకు మూతపడిరదో అర్ధం కాని పరిస్థితి ఉందంటున్నారు. 


మొత్తం మీద ముమ్మిడివరం బస్‌స్టాండ్‌ స్థలంలో నిబంధనల అతిక్రమణపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.. దీనిపై అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌ను వివరణ కోరగా ఆ స్థలం పర్యవేక్షణ తమ ఆధీనం లేదని, ఆ స్థలంతో తమ డిపోకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.