పార్టీ మారిన వారిపై మూడు నెలల్లోగా అనర్హతా వేటు వేసేలా  రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను మార్చాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుకు వైసీపీ ఎంపీలు లేఖ రాయడంపై రఘురామకృష్ణరాజు స్పందించారు.  ఇతర పార్టీల నుంచి గెలిచి వైసీపీలో చేరిన వారిపై చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. వైసీపీ ఎంపీలు కిరణ్ రిజుజును ఇలా కోరారని.. మీ దగ్గర అనర్హతా పిటిషన్లు పెండింగ్‌లో ఉంటే వాటిని పరిష్కరించాలని రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎంపీలు ... కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజుకు ఇచ్చిన లేఖలో ఎక్కడా రఘురామ కృష్ణరాజు పేరును ప్రస్తావించలేదు. కానీ వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రఘురామపై అనర్హతా వేటు వేయించమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే.. ఆయనను ఉద్దేశించే ఆ లేఖ రాశారని భావిస్తున్నారు. 


ఇలాగే రఘురామకృష్ణరాజు కూడా భావించినట్లుగా ఉన్నారు. అందుకే ఆయన రివర్స్‌లో వైసీపీలో చేరిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు లేఖ రాశారని భావిస్తున్నారు. టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ వైసీపీకి మద్దతు పలికారు. వీరెవరూ లాంఛనంగా కండువా మాత్రం కప్పించుకోలేదు. కానీ ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక జనసేన పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలో అనధికారికంగా చేరారు. ఆయనకూ అధికారికంగా కండువా కప్పుకోలేదు. కానీ వీరంతా వైసీపీ కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. 


తాము ఏ పార్టీ తరపున గెలిచామో ఆ పార్టీని.. ఆ పార్టీ నేతల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయినప్పటికీ.. వారు వైసీపీలో  చేరలేదన్న కారణంగా  స్పీకర్ తమ్మినేని సీతారం వారిపై అనర్హతా వేటు వేయకపోగా... ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తున్నారు.  వైసీపీ ఎంపీలు కిరణ్ రిజుజుకు రాసిన లేఖను బట్టి... వైసీపీ కోరుకున్నట్లుగా ముందుగా ఏపీలో అమలు చేయాలని రఘురామరాజు కోరుతున్నారు. రఘురామరాజు వైసీపీని విమర్శిస్తున్నారు కానీ ఏ పార్టీతోనూ సన్నిహితంగా మెలగడం లేదు.  కుటుంబసభ్యుల్ని కూడా ఇతర పార్టీల్లో చేర్పించలేదు. 


మరో వైపు ఢిల్లీలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన రఘురామకృష్ణరాజు...  తమ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి  షర్మిల పాత్ర కూడా ఉందని, బాగా ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయంలో సగ భాగం పాత్ర వహించిన షర్మిలకు ఆస్తిలో కూడా సగ భాగం ఇవ్వాలని జగన్‌కు సూచించారు. రఘురామకృష్ణరాజు ప్రతీ రోజూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం... వైసీపీ ఎంపీలు ఆయనపై చర్యలు తీసుకోవాలని అందర్నీ కలవడం రోజూ జరుగుతోంది.