వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతల ఆడియోలు అంటూ వరుసగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్ టేపులపై విచారణ జరిపించాలని ఎంపీ రఘు రామకృష్ణరాజు డిమాండ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆ టేపులు తమవి కావని అటు ఫృధ్వీ, అంబటితో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా చెప్పారని గుర్తు చేశారు. ఇలాంటి ఆడియోల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల గొంతులను అనుకరిస్తోంది ఎవరో తక్షణం తేల్చేలా విచారణ జరిపించాలని అన్నారు. తాను అయితే  ముగ్గురు వైసీపీ నేతలు అలా అడవాళ్లతో మాట్లాడారని అనుకోవడం లేదన్నారు. కానీ వాటి వెనుక ఎవరున్నారో తేలాల్సిందేనని ఆయన వ్యాక్యానించారు. ఓ వైపు వైసీపీ నేతల రాసలీలల ఆడియో టేపులు.. మరో వైపు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దిశ చట్టం వచ్చిన దుండగులకు ఎందుకు భయం ఉండటం లేదని ప్రశ్నించారు.  


ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపైనా రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు చేశారు. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ అస్తమిస్తోందన్నది నిజమని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను కట్ చేసి..  దాన్ని జమ చేయకుండా వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. మా ప్రభుత్వ రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల అప్పులు చేసిందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. దొంగ కార్పొరేషన్లతో అప్పులు చేశారని.. వాటిని లెక్కల్లో కూడా చూపించలేదన్నారు. చేసిన వడ్డీకి అప్పులే మూడు వేల కోట్ల వరకూ చెల్లించాల్సి ఉందని..  అప్పు చేసి పప్పు బెల్లాల్లా పంచేస్తారా అని మండిపడ్డారు. సంక్షేమం అవసరమే కానీ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆప్ఖనిస్థాన్ పరిస్థితులు మన దగ్గరకు తీసుకు రావొద్ది ముఖ్యమమంత్రి జగన్‌కు సూచించారు. 


ఆదాయ మార్గాలను పెంచాలని కలెక్టర్లకను జగన్ ఆదేశించారని..  కలెక్టర్లకు ఆదాయ మార్గాలకు సంబంధం ఏమిటని రఘురామకృష్ణరాజు సందేహం వ్యక్తం చేశారు. ఈ నెల ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులకు జీతాలు రాలేదని గుర్తు చేశారు. ఇన్ని అప్పులు చేసినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. రఘురామకృష్ణ రాజు ప్రతీ రోజూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. శాంతిభద్రతల వైఫల్యంతో పాటు ఆర్థిక పరిస్థితులు.. వైసీపీలోని అంతర్గత రాజకీయాలపైనా స్పందిస్తున్నారు. 


మొదట్లో రఘురామకృష్ణరాజు కౌంటర్ ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆసక్తి చూపేవారు. అయితే ఆయన రాను రాను ఆ కౌంటర్లకు ఘాటుగా సమాధానాలిస్తూండటంతో ప్రస్తుతం ఆయనపై ప్రతి విమర్శలు చేయడం మానుకున్నారు. అయినా రఘురామకృష్ణరాజు ప్రభుత్వంపై విమర్శలు మాత్రం మానుకోలేదు.