MP Lavu YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన అంశం డేటా చోరీ. ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రైవేటు సంస్థలకు చేరు వేస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలన్నింటినీ ప్రభుత్వం ఖండించింది. ఇప్పుడిదే అంశంపై పార్లమెంట్‌లో  భిన్నంగామాట్లాడారు ఎంపీ లావు కృష్ణదేవరాయులు.  వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ లావు కు మాట్లాడే అవకాశం వచ్చింది. ప్రభుత్వం సేకరిస్తున్న వ్యక్తిగత వివరాలు పథకాల అమలు కోసం వినియోగించుకోవచ్చని బిల్లులో ఉందని.. కానీ ప్రభుత్వాలు వాటిని దుర్వినియోగం చేసి  ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉపయోగించుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయాల్సి ఉందన్నారు.                                           

  


ప్రభుత్వం.. డేటా చదుర్వినియోగం అనే మాట వినిపిస్తే.. అందరూ  చూసేది వైసీపీ ప్రభుత్వం వైపే. వాలంటీర్ల తో సమాచారం సేకరించి.. ప్రభుత్వం ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు విస్తృతంగా వస్తున్నాయి.  ఓ ప్రైవేటు కంపెనీకి సమాచారాన్ని షేర్ చేస్తున్నారని..  వారి ద్వారా ఓటర్లను 360 డిగ్రీల ప్రోపైలింగ్ తయారు చేసి ఓటర్లను ప్రభావితం చేసే కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఎంపీ లావు...  నేరుగా పార్లమెంట్‌లోనే మాట్లాడారు.  ఆ విషయంపై స్పష్టత ఉన్నా...  లావు కృష్ణదేవరాయులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా ఏపీ ప్రభుత్వం అని ఆయన చెప్పలేదు కానీ.. సులువుగానే అర్థమైపోతుంది. వాలంటీర్ల వివాదం ఉన్నప్పుడు లావు అలా ఎలా మాట్లాడారని వైసీపీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.                      


ఇప్పటికే ఆయన  వైసీపీ అధినేత తీరుతో అసంతృప్తి చెంది పార్టీకి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.  ఎంపీ లావు టీడీపీ  తీర్థం పుచ్చుకోబోతున్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబుతో రహస్యంగా భేటీ అయ్యారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ఆయన వీటిని  ఖండించారు. నరసారావుపేట పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కూడా లావు కృష్ణదేవరాయులుకు  సరిపడటం లేదు. ముఖ్యంగా మంత్రి విడదల రజనీకి... కృష్ణదేవరాయులకు వివాదాలున్నాయి. చిలుకలూరిపేట నియోజకవర్గంలో ఆయనను పర్యటించేందుకు కూడా విడదల రజనీ అంగీకరించడం లేదు.  


ప్రోటోకాల్ ప్రకారం కూడా లావు కృష్ణదేవరాయులుకు  పార్టీలో ప్రాధాన్యం లభించడం లేదన్న  అభిప్రాయం వినిపిస్తోంది. ఆయనతో పాటు ఆయన అనుచరులనూ పార్టీలో దూరం పెడుతున్నారన్న అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఈ కారణంగా వైసీపతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్న ఆయన.. ఇప్పుడు డేటా విషయంలో ప్రభుత్వాలే దుర్వినియోగం చేస్తున్నట్లుగా వ్యాఖ్యనించడం కలకలం రేపుతోంది. గతంలో తెలుగు విషయంలో ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై పరోక్షంగా రఘురామకృష్ణరాజు పార్లమెంట్‌లోనే వ్యతిరేకంగా మాట్లాడారు.