ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మచిలీపట్టణం పోర్ట్ నిర్మాణ పనులను డిసెంబర్ 31న ప్రారంభించేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని పోర్ట్ పనులు ప్రారంభించాలని యోచనలో ఉన్నామని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వెల్లడించారు.ప్రారంభించిన రెండున్నర సంవత్సరాల్లో పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.


కోస్తాకు మణిహరం మచిలీపట్టణం పోర్ట్ 


ఏపీ ప్రభుత్వం మచిలీపట్టణం పోర్ట్ ను పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి పోర్ట్ పనులకు శంఖుస్దాపన చేశారు. ఆయనకు ముందు చంద్రబాబు కూడా పనులు ప్రారంభించాలనే ఉద్దేశంతో భూమి పూజ చేశారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు. ఇప్పుడు మరోసారి ఈ వ్యవహరం తెరమీదకు వచ్చింది. మచిలీపట్ణణం ఎంపీ బాల శౌరి పోర్ట్ నిర్మాణంపై ప్రకటన చేసిన నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మచిలీపట్టణం పోర్ట్ ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. సుదీర్ఘమయిన సముద్ర తీరం ఏపీ సొంతం. దీంతో ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే అనేక సార్లు ప్రయోగాలు చేసినప్పటికి ఎటువంటి ఉపయోగం లేకుండాపోయింది. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ నాయకత్వంలో మరోసారి పోర్ట్ నిర్మాణ పనులకు శంఖుస్దాపన చేసేందుకు రంగం సిద్దం చేశారు.


కేంద్రం వాటా ఎంతంటే? 


ఏపీలో మచిలీపట్టణం పోర్ట్ అవసరం చాలా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోర్ట్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే, ఏపీ రూపురేఖలను మార్చేయవచ్చని జగన్ సర్కార్ భావిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్  కింద రూ.3941 కోట్లు మంజూరు అయ్యింది. పోర్టు నిర్మాణం పూర్తయ్యాక స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు, యువతకు దక్కుతాయని అంచనా. మచిలీపట్నం పరిసర ప్రాంతాలు యువతీ యువకులు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. మచిలీపట్నం టూ విజయవాడ ఆరులైన్ల  రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు వీలుటుందని భావిస్తున్నారు. మరో ఏడాదిన్నర కాలంలో ఏపీలో ఎన్నికలు వస్తాయి. ఇప్పటికిప్పుడు పోర్ట్ పనులు ప్రారంభించినా కూడా ఎన్నికల నాటికి పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువ. దీంతో పోర్ట్ పనులు ప్రారంభించి, పనులు జరుగుతున్నా కూడా వైసీపీకి మైలేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 


ఈ సారి కూడా ఎన్నికల స్టంటేనా 


మచిలీపట్నం పోర్ట్ పనులు అనేవి ఏపీలో రాజకీయాలకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పోర్ట్ అంశం తెర మీదకు వస్తుంది. ఇప్పుడు కూడా ఏపీలో ఎన్నికల వ్యవహారం తెర మీదకు వస్తున్న తరుణంలో మరోసారి కూడా ఈ వ్యవహరం కేవలం ఎన్నికలకు మాత్రమే పరిమితం అవుతుందా అనే సందేహం స్దానికుల్లో ఉంది. గతంలో చంద్రబాబు, వైఎస్ఆర్ ముఖ్యమంత్రులుగా పని చేసిన తరుణంలో అప్పుడు కూడా ఎన్నికల సీజన్ కు ముందుగానే పోర్ట్ పనులను ప్రారంభించారు. ఆ తరువాత పోర్ట్ అంశం పై కనీసం తలెత్తి చూడని పరిస్దితులు ఉన్నాయని స్దానికులు గుర్తు చేస్తున్నారు.


పోర్ట్ సాధన సమితి ఆందోళనలు 


పోర్ట్ సాదన కోసం స్దానికంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కలసి పోర్ట్ సాధన సమితిని కూడా ఏర్పాటు చేశాయి. అయితే అధికారంలో ఉన్న పార్టీ తప్ప మిగిలిన పార్టీలన్నీ సమితిలో భాగస్వామ్యం కావటం విశేషం. దాదాపుగా 500 రోజులకు పైగా పోర్ట్ సాధన సమితి ఆందోళనలు చేసింది. ఆ తరువాత అలసిపోయి విరమించుకోవాల్సి వచ్చింది.