తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి , ఎమ్మెల్యే పదవికి వారం రోజుల్లో నిర్ణయించుకున్నట్లుగా ఆయన తన అనుచరులకు సమాచారం ఇచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీలో కలకలం ప్రారంభమయింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కొద్ది రోజులుగా తనను దూరం పెడుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కనీసం తాను చేసే ఫోన్లను కూడా రిసీవ్ చేసుకోవడం లేదని ఇంత నిరాదరణకు గురి చేస్తున్న పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రేపోమాపో అనుచరులతో సమావేశాలు నిర్వహించి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 


గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత. పార్టీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు. ఇటీవలి ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవాని మామ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలో మరో కీలక నేతగా ఉన్నారు. ఆయన వర్గంతో గోరంట్లకు సరిపడటం లేదని ప్రచారం ఉంది. ఈ కారణంగా ఇటీవల గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన వారసుడ్ని కూడా ప్రకటించారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. ఈ కారణంగా తన దివంగత సోదరుడు శాంతారామ్ కుమారుడు, రవిరామ్ కిరణ్ ను రాజకీయ వారసుడిగా ప్రకటించారు. తన నియోజకవర్గంలో ఆదిరెడ్డి కుటుంబీకులు జోక్యం చేసుకుంటున్నారనే ఇలా ప్రకటించారని ఆయన వర్గీయులు అనుకుంటున్నారు.


అయితే ఇటీవలి కాలంలో  పార్టీ నేతల మధ్య ఈ వర్గ విబేధాలు మరింత ముదిరాయని వాటిని సర్దుబాటు చేయడానికి హైకమాండ్ ఆసక్తి చూపించలేదని గోరంట్ల అసంతృప్తికి గురయ్యారు. తన వర్గీయుల్ని ఆదిరెడ్డి అప్పారావు వర్గం ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. చివరికి తనను కలవడానికి కూడా అడ్డంకులు కల్పిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను చెప్పడానికి తను పదే పదే ఫోన్ చేసిన స్పందించలేదన్న అసంతృప్తితో ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి గోరంట్లకు ఫోన్ చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో మాట్లాడారని .. అన్ని విషయాలు వచ్చే వారం మాట్లాడుకుందామని చెప్పినట్లుగా తెలుస్తోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేయరని.. అంతర్గత రాజకీయాల వల్లే అసంతృప్తికి గురయ్యారని పార్టీ అధినేత వాటిని సర్దుబాటు చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 


ఈ అంశంపై మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నిరాకరించారు. ఇప్పుడేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు.